దంపతులను బలిగొన్న కుటుంబ కలహాలు
మహేశ్వరం: కుటుంబ కలహాలు భార్యాభర్తలను బలిగొన్నాయి. భర్త చేయి చేసుకున్నాడని భార్య ఆత్మహత్య చేసుకోగా... అది చూసి భర్త కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... మహేశ్వరం మండలం హర్షగూడ గ్రామానికి చెందిన మూడావత్ కృష్ణ(35)కు అదే గ్రామానికి చెందిన మూడావతి దోలి(30)తో పెళ్లైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. లారీ డ్రైవర్గా పని చేసే కృష్ణ తాగుడుకు బానిసై భార్యను వేధించేవాడు.
కూలి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న దోలిని కృష్ణ తరచూ కొట్టేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండటంతో దోలి తల్లిగారింటికి వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న కృష్ణ మంగళవారం సాయంత్రం అత్తగారింటికి వెళ్లి భార్యపై చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపం చెందిన దోలి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
భార్య మృతితో మనస్తాపం చెందిన కృష్ణ కూడా ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. క్షణికావేశంలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవడంతో ముగ్గురు పిల్లలూ అనాథలయ్యారు. విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు వారు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని కన్నీరుపెట్టుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.