జీవితంలో ఫెయిల్ అయ్యా..

జీవితంలో ఫెయిల్ అయ్యా.. - Sakshi

  • సూసైడ్‌నోట్ రాసి యువకుడి ఆత్మహత్య

  • శామీర్‌పేట్‌లో విషాదం  

  • మృతుడు కరీంనగర్ జిల్లావాసి

  • శామీర్‌పేట్: ‘నేను జీవితంలో ఫెయిల్ అయ్యాను.. అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్న’ అంటూ ఓ యువకుడు తనువు చాలించాడు. సదరు యువకుడు సూసైడ్ నోట్ రాసి జేబులో పెట్టుకొని పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం వెలుగు చూసింది. ఎస్‌ఐ మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం..

     

    కరీంనగర్  జిల్లా మంచిర్యాలలోని శ్రీరాంపురం నివాసి ఆదిత్యపవన్(23) కొన్నాళ్ల క్రితం బీటెక్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చాడు. నారాయణగూడలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ కోచింగ్ సెంటర్‌లో చేరాడు. శుక్రవారం కరీంనగర్ వెళ్తున్నానని అతడు హాస్టల్‌లో చెప్పి బయలుదేరాడు. ఇదిలా ఉండగా శనివారం శామీర్‌పేట్‌లోని శివగంగా బోర్‌వెల్ కార్యాలయం వెనుక అటవీ ప్రాంతంలో ఓ యువకుడి మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.



    మృతుడి జేబులో ఉన్న ఆధార్‌కార్డు ఆధారంగా అతడు మంచిర్యాలలోని శ్రీరాంపురం నివాసి ఆదిత్యపవన్‌గా గుర్తించారు. ఘటనా స్థలానికి సమీపంలో ఓ పురుగుల మందు డబ్బా పడి ఉంది. అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా భావిస్తున్నారు. మృతుడి జేబులో ఓ సూసైడ్ నోట్ లభించింది.



    ‘నేను జీవితంలో ఫెయిల్ అయ్యాను.. అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్న’ అని ఆదిత్యపవన్ తన తల్లిదండ్రులకు రాశాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top