శుద్ధ జలం పేరిట సాధారణ నీళ్లు


సాక్షి, కరీంనగర్‌ :


నాణ్యతా ప్రమాణాలను మచ్చుకైనా పాటించరు.. ఎటువంటి అనుమతులూ తీసుకోరు.. ప్రాథమిక నిబంధనలు కూడా అమలు చేయరు.. ప్రభుత్వానికి పన్నులు చెల్లించరు.. అయితేనేం స్వచ్ఛ నీరంటూ రూ.కోట్లల్లో వ్యాపారం చేస్తూ ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు.


 


శుద్ధజలం పేరుతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో నీటి వ్యాపారం చేస్తున్న కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి రూ.కోట్లు సంపాదిస్తున్నారు. అధికారుల నియంత్రణ కరువవడంతో నీళ్ల వ్యాపారం ఇష్టారాజ్యంగా సాగుతోంది. మినరల్‌ వాటర్‌ పేరిట జనరల్‌ వాటర్‌ సరఫరా చేస్తూ వినియోగదారులకు లేని రోగాలను అంటగడుతున్నారన్న  విమర్శలు వస్తున్నాయి.


 


భారత ప్రమాణాల సంస్థ (బీఎస్‌ఐ) నిబంధనలను పూర్తిగా విస్మరించిన వాటర్‌ ప్లాంట్ల నిర్వాహకులకు ‘అమ్యామ్యాల’కు రుచిమరిగిన అధికారులు తోడు కావడంతో అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్, పెద్దపల్లి, గోదావరిఖని, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, సిరిసిల్ల, వేములవాడతోపాటు పలుచోట్ల ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. సుమారుగా 300 వరకు వాటర్‌ ప్లాంట్లు ఉన్నా.. కేవలం ఐదింటికీ మాత్రమే బీఎస్‌ఐ అనుమతి ఉంది. 


 


ఏటా రూ.లక్షల్లో పన్నుల ఎగవేత.. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహణ..


జిల్లాలో నిర్వహిస్తున్న మినరల్‌ వాటర్‌ ప్లాంట్లలో చాలా మంది ప్రమాణాలను పాటించడం లేదు. డబ్బులు ఎరగా వేసి.. అనుమతులు తీసుకుంటూ.. వ్యాపారులు అరకొర వసతులతో చిన్న చిన్న గదుల్లో ప్లాంట్లను నిర్వహిస్తున్నారు. నీటిని నిల్వచేసే క్యాన్లను ప్రతిసారీ శుభ్రం చేయకుండానే సరఫరా చేస్తున్నారు. వాటర్‌ ప్లాంట్లలో మైక్రోబయాలజిస్టు, కెమిస్టులు అందుబాటులో ఉండటం లేదు. పీహెచ్, టీడీఎస్‌ పరీక్షలు అసలే జరగడం లేదు. శానిటరీ అధికారులు మామూళ్లకు రుచిమరిగి తనిఖీలు చేయడం లేదు. కొన్ని సంస్థలు ఐఎస్‌ఐ సర్టిఫికెట్లు కలిగినప్పటికీ వాటిని ప్రతి సంవత్సరం రెన్యువల్‌ చేయించడం లేదు. వాటర్‌ సెంటర్లు కచ్చితంగా భూగర్భజలాలను ఉపయోగించాలి. అయితే.. కొందరు ఇతర ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారా నీళ్లు తీసుకువచ్చి వినియోగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఒక లీటరు శుద్ధి జలాన్ని తయారు చేయడానికి మూడు లీటర్ల నీరు వృథా అవుతుంది. ఈ క్రమంలో భూగర్భజలాలను విరివిగా తీయడం వల్ల ఈ ప్లాంట్లు ఉన్న ప్రాంతంలో భూగర్భ నీటినిల్వలు తగ్గిపోతున్నాయని చుట్టుపక్కల వారు ఫిర్యాదులు చేస్తున్నారు. అయినా.. అక్రమంగా నిర్వహిస్తున్న ప్లాంట్లపై చర్యలు తీసుకోవడానికి అధికారులు జంకుతున్నారు. మినరల్‌ వాటర్‌పై కూడా 12.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉండగా, సేవా ముసుగులో వాటర్‌ప్లాంట్ల నిర్వాహకులు ఆ పన్నులు ఎగవేస్తున్నారు.


 


ప్రమాణాలకు మంగళం.. అధికారుల ఉదాసీనతే కారణం..


మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ నిర్వహించాలంటే ఐఎస్‌ఐ నిబంధనలు తప్పకుండా పాటించాలి. భారత ప్రమాణాల సంస్థ(బీఎస్‌ఐ) అనుమతుల సమయంలో ఇచ్చిన మార్గదర్శక సూత్రాలను అమలు చేయాలి. వాటర్‌ ప్లాంట్‌లో మైక్రోబయాలజిస్టు, కెమిస్టులు విధిగా ఉండాలి. వీరు శుద్ధిచేసిన ప్రతి బ్యాచ్‌కు చెందిన నీటిలోని పీహెచ్‌ను పరీక్షిస్తూ ఉండాలి. పీహెచ్‌ 7 కంటే తగ్గితే కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయని బీఎస్‌ఐ, డాక్టర్లు చెబుతున్నారు.


 


నీటిలో పూర్తిగా కరిగి ఉండే లవణాలను (టీడీఎస్‌) కూడా పరీక్షించాలి. కొత్తగా ఒక వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తే కనీసం 10 గదులు ఉండేలా చూడాలి. ఇందులోనే నీటిని పరీక్ష చేసే ల్యాబ్, అందుకు ఉపయోగించే పరికరాల కోసం రెండు గదులు కేటాయించాలి. 


ఫిల్లింగ్‌ సెక్షన్, ఆర్‌వో సిస్టంలో 3 వేల లీటర్ల కెపాసిటీ డ్రమ్ములను ఏర్పాటు చేయాలి. శుద్ధిచేసిన జలాలను నిల్వచేసేందుకు 304 గ్రేడ్‌ స్టెయిన్ లెస్‌ స్టీల్‌తో తయారు చేసిన డ్రమ్ములు వాడా లి. శుద్ధిచేసిన నీటిని తప్పకుండా ఓజోనైజేషన్  చెయ్యాలి 


 


మినరల్‌ వాటర్‌ను బబుల్స్‌ (క్యాను)లోకి పట్టేముందు అల్ట్రావైరస్‌ రేస్‌తో వాటిని శుద్ధి చేయాలి. నీటిని క్యా¯ŒSలోకి పట్టిన తర్వాత రెండు రోజులపాటు భద్రపరిచి అనంతరం మార్కెట్లోకి పంపాలని బీఎస్‌ఐ నిబంధనలు సూచిస్తున్నాయి. నీటిని సరఫరా చేసే క్యానులకు ప్రతిసారీ పొటాషియం పర్మాంగనేట్‌ లేదా హైపోసొల్యూషన్ తో కెమికల్‌ క్లీనింగ్‌ చేయాలి. సీలుపై నీటిని శుద్ధి చేసిన తేదీ, బ్యాచ్‌ను వేయాలి. నీటిని క్యానులలోకి నింపేవారు చేతులకు గ్లౌజస్‌ ధరించాలి. శానిటరీ అధికారులతో ప్రతినెలా నీటిని తనిఖీ చేయించి రిపోర్టును ఐఎస్‌ఐకి పంపాలి. ఏటా ఐఎస్‌ఐ గుర్తింపు ఉన్నవాళ్లు తప్పనిసరిగా రెన్యువల్‌ చేయించుకోవాలి. ఇవేమీ పాటించకున్నా నిర్వహిస్తున్నారంటే అధికారుల ఉదాసీనతే కారణమన్న చర్చ జరుగుతోంది.  


 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top