సీట్లు తక్కువ.. విద్యార్థులు ఎక్కువ

సీట్లు తక్కువ.. విద్యార్థులు ఎక్కువ


కన్వీనర్‌ కోటాలో గతేడాది కన్నా తగ్గిన సీట్లు

సీట్లు 62,746.. వెరిఫికేషన్‌ చేయించుకున్న వారు 64,340

గతేడాది 5 వేల సీట్లు అదనం.. ఈసారి 1,594 సీట్లు తక్కువ

కన్వీనర్‌ కోటా ప్రవేశాలకు ముగిసిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

నేడు వెబ్‌ ఆప్షన్లలో మార్పులకు అవకాశం.. 28న సీట్లు కేటాయింపు




సాక్షి, హైదరాబాద్‌: ఈసారి ఇంజనీరింగ్‌లో విద్యార్థులకు కోరుకున్న కాలేజీల్లో సీట్లు లభిం చడం కొంచెం కష్టంగా మారింది. కన్వీనర్‌ కోటాలో అందుబాటులో ఉన్న సీట్లు తక్కువగా ఉండటం.. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. గతేడాది కన్వీనర్‌ కోటాలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన విద్యార్థుల సంఖ్య కన్నా 5 వేలకు పైగా ఎక్కువ సీట్లున్నాయి. ఈ సారి విద్యార్థుల సంఖ్య కంటే 1,594 సీట్లు తక్కువగా ఉన్నాయి. దీంతో ఎక్కువ మంది కోరుకున్న కాలేజీల్లో సీట్లు లభించడం కాస్త కష్టమే.



గతేడాది కన్వీనర్‌ కోటాలో 71,066 సీట్లు అందుబాటులో ఉండగా, వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్న 66,566 విద్యార్థుల్లో మొదటి దశ కౌన్సెలింగ్‌లో 57,789 మందికే సీట్లు లభించాయి. ఈ సారి కన్వీనర్‌ కోటాలో 62,746 సీట్లు అందుబాటులో ఉండగా, గురువారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ముగిసే సమయానికి 64,340 మంది హాజరయ్యారు. వెరిఫికేషన్‌ కు హాజరైన విద్యార్థుల కన్నా 1,594 సీట్లు తక్కువగా ఉన్నాయి. ఈ లెక్కన ఎంత మందికి మొదటి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు లభి స్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.



మేనేజ్‌మెంట్‌ కోటా వైపు మొగ్గు..!

కన్వీనర్‌ కోటాలో కోరుకున్న కాలేజీల్లో సీట్లు లభిస్తాయో లేదోనన్న అనుమానంతో డబ్బు చెల్లించగలిన వారు మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. గతేడాది కన్వీనర్‌ కోటా, మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లు మొత్తం 1.04 లక్షలుండగా, ఎంసెట్‌లో 1.06 లక్షల మంది విద్యార్థులు అర్హత సాధించారు. కానీ ఈ సారి మొత్తం సీట్లు 92,700 వరకు ఉండగా, అర్హులు మాత్రం 1.03,500 మంది ఉన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి 11 వేల సీట్లు తగ్గిపోయాయి. దీనివల్ల కూడా మేనేజ్‌మెంట్‌ కోటాకు డిమాండ్‌ ఏర్పడింది.



వెబ్‌ ఆప్షన్లలో మార్పులకు అవకాశం..

ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ వెరిఫికేషన్‌ గురువారంతో ముగిసింది. వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోనివారు ఈ నెల 23న  ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్‌ వెల్లడించారు. ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులు శుక్రవారం తమ ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చు. ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి ఈ నెల 28న రాత్రి 8కు సీట్లు కేటాయించనున్నారు. జ్టి్టpట://్టట్ఛ్చఝఛ్ఛ్టి.nజీఛి.జీn వెబ్‌సైట్‌లో వివరాలను ఉంచుతామని వివరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top