మెడి‘సీన్ రివర్స్’!


* తెలుగు రాష్ట్రాల ఎంసెట్‌లలో ఆసక్తికర ఫలితాలు

* టీఎంసెట్‌లో ‘మెడిసిన్’ టాపర్ ఏపీ విద్యార్థి..

* ఏపీ ఎంసెట్‌లో తెలంగాణ విద్యార్థికి ఫస్ట్ ర్యాంకు

* ఇంజనీరింగ్‌లో రెండు చోట్లా తెలంగాణ విద్యార్థులకే మొదటి స్థానం

* టీఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి

* నేటి నుంచి వెబ్‌సైట్‌లో ఓఎంఆర్ జవాబు పత్రాలు

* ఉత్తీర్ణత: మెడిసిన్‌లో 85.98%, ఇంజనీరింగ్‌లో 70.65%

* జూలై 7 నుంచి ఇంజనీరింగ్ తరగతులు

* ప్రవేశాలకు వచ్చే నెల 12న షెడ్యూల్




రెండు రాష్ట్రాల ఎంసెట్‌లలో ఆసక్తికర ఫలితాలు

సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వేర్వేరుగా నిర్వహించిన ఎంసెట్‌ల ఫలితాలు ఆసక్తికరంగా వచ్చాయి. ముఖ్యంగా అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ విభాగంలోనైతే ఏపీ పరీక్షలో తెలంగాణకు చెందిన అబ్బాయి టాప్ ర్యాంకు సాధించగా.. తాజాగా గురువారం విడుదలైన తెలంగాణ పరీక్షలో ఏపీకి చెందిన అమ్మాయి మొదటి ర్యాంకు సాధించింది. అంతేకాదు రాష్ట్ర విభజన తరువాత మొదటిసారిగా వేర్వేరుగా జరిగిన ఈ రెండు ఎంసెట్‌లకు పలువురు విద్యార్థులు హాజరయ్యారు. వారిలో కొందరు రెండు చోట్లా మంచి ర్యాంకు సాధించారు కూడా.

 గురువారం ప్రకటించిన తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అమ్మాయి ఉప్పల పాటి ప్రియాంక మొదటి ర్యాంకు సాధించింది.

 

అదే ఈనెల 21న ప్రకటించిన ఏపీ ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ విభాగం ఫలితాల్లో తెలంగాణకు చెందిన విద్యార్థి కాడ శ్రీవిధుల్ మొదటి ర్యాంకును కైవసం చేసుకోవడం గమనార్హం. ఇంజనీరింగ్ విభాగంలో మాత్రం రెండు రాష్ట్రాల్లోనూ తెలంగాణ విద్యార్థులే మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నారు. తెలంగాణ ఎంసెట్ ఇంజనీరిం గ్ విభాగంలో తెలంగాణకు చెందిన మోపర్తి సాయి సందీప్ మొదటి ర్యాంకును కైవసం చేసుకోగా... అటు ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలోనూ హైదరాబాద్‌కు చెందిన కొండపల్లి అనిరుధ్‌రెడ్డి మొదటి ర్యాంకు సాధించాడు. మొత్తంగా తెలంగాణ ఎంసెట్ మెడిసిన్ విభాగంలో టాప్-10 ర్యాంకులు సాధించిన వారిలో ఐదుగురు తెలంగాణకు చెంది న వారు కాగా.. మరో ఐదుగురు ఏపీకి చెందిన విద్యార్థులు. తెలంగాణ ఇంజనీరింగ్‌లో మాత్రం టాప్-10లో ఎనిమిది మంది రాష్ట్ర విద్యార్థులు కాగా.. ఇద్దరే ఏపీ వారు.

 

 ర్యాంకులు విడుదల చేసిన కడియం

 తెలంగాణ ఎంసెట్ ఫలితాలు, ర్యాంకులు గురువారం ప్రకటించారు. హైదరాబాద్ జేఎన్టీయూలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ర్యాంకులను విడుదల చేశారు. విద్యార్థులకు ఎంసెట్‌లో వచ్చిన స్కోర్‌కు వారు ఇంటర్ సాధించిన మార్కుల వెయిటేజీ (25 శాతం) కలిపి ఈ ర్యాంకులను ప్రకటించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, జేఎన్టీయూ వీసీ శైలజారామయ్యార్, సాంకేతిక విద్య కమిషనర్ వాణీప్రసాద్, ఎంసెట్ కన్వీనర్ రమణరావు, మండలి కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జేన్టీయూహెచ్ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో 2015-16 విద్యా సంవత్సరం నుంచి ప్రథమ సంవత్సరంలో కూడా సెమిస్టర్ విధానాన్ని అమలుచేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

 

 ఇంజనీరింగ్‌లో 70.65 శాతం..

 తెలంగాణ ఎంసెట్ కోసం మొత్తంగా 2,32,047 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఇంజనీరింగ్ కోసం 1,39,682 మంది దరఖాస్తు చేసుకోగా.. ఈనెల 14న నిర్వహించిన పరీక్షకు 1,28,162 మం ది హాజరయ్యారు. ఇందులో 90,556 మంది విద్యార్థులు (70.65 శాతం) అర్హత సాధించారు. ఇక అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ కోసం 92,365 మంది దరఖాస్తు చేసుకోగా.. 84,659 మంది పరీక్ష రాశారు. అందులో 72,794 మంది (85.98 శాతం) విద్యార్థులు అర్హత సాధించారు.

 

వెబ్‌సైట్‌లో జవాబు పత్రాలు..

 విద్యార్థుల ఓఎంఆర్ జవాబు పత్రాలను ఎంసెట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నారు. 29వ తేదీ సాయంత్రం 5 నుంచి వచ్చే నెల 2వ తేదీ సాయంత్రం 5 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాటిలో ఏమైనా తేడాలుంటే వెంటనే వెబ్‌సైట్ ద్వారా తెలియజేయాలి. 3వ తేదీ నుంచి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 

గణితంలో మారిన ఆప్షన్..

 ఎంసెట్ గణితం సబ్జెక్టు కోడ్-ఏలో 23వ ప్రశ్నకు (కోడ్-బీలో 60వ, కోడ్-సీలో 24వ, కోడ్-డీలో 68వ ప్రశ్నగా వచ్చింది) ప్రాథమిక కీలో 3వ ఆప్షన్‌ను సరైన సమాధానంగా పేర్కొనగా.. దానిపై అభ్యంతరాలను పరిశీలించిన నిపుణుల కమిటీ 2వ ఆప్షన్‌ను సరైన సమాధానంగా ఖరారు చేసింది. ఇక మెడి సిన్ పరీక్ష కోడ్-ఏలో 43వ ప్రశ్నకు 1, 3గా  సమాధానాలుగా మార్చారు.

 

 టాపర్ల మనోగతం: మెడిసిన్ విభాగం

 కష్టపడి చదివాను

 ‘‘ చాలా కష్టపడి చదివాను. ఇంటర్‌లో 98శాతం మార్కులు సాధించా. ఏపీ ఎంసెట్‌లో మొదటి ర్యాంకు వచ్చినా కూడా తెలంగాణలోనే చదువుతా. పేద ప్రజలకు సేవలందిస్తా. ’’    

 - కాడ శ్రీవిధుల్, 2వ ర్యాంకు  



 కార్డియాలజిస్ట్ అవుతా..

 ‘‘ఎంసెట్‌లో 160 మార్కులకు 159 మార్కులు సాధించా. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చదవాలని ఉంది. కార్డియాలజిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. పేదలకు వైద్యం అందించాలనేది నా లక్ష్యం..’’

 - వంగాల అనూహ్య, 3వ ర్యాంకు

 

 మెడిసిన్ చేయాలనేది కోరిక..

 ‘‘మెడిసిన్ చేయాలన్నది ఎప్పటి నుం చో నా కోరిక.  ఎయిమ్స్‌లో సీటు సాధించేందుకు శాయశక్తులా కష్టపడతా. ఏపీ ఎంసెట్‌లో 85వ ర్యాంకు వచ్చింది. కష్టపడి చదవడంతో తెలంగాణ ఎంసెట్‌లో 4వ ర్యాంకు వచ్చింది. ఇంటర్‌లో 984 మార్కులు వచ్చాయి’’    

 - సాయితేజ, 4వ ర్యాంకు

 

 న్యూరాలజిస్టునవుతా..

 ‘‘ఉస్మానియా మెడికల్ కాలేజీలో మెడిసిన్ చేయాలన్నది నా కోరిక. గొప్ప న్యూరాలజిస్టు కావడం నా లక్ష్యం. రోజుకు 8 నుంచి 10 గంటలు చదివా. కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే ఈ ర్యాంకు సాధించాను’’

 - చెన్నూరి సాయిరెడ్డి, 5వ ర్యాంకు

 

 నిజాయితీగా సేవలందిస్తా...

 ‘‘అమ్మా నాన్న కష్టజీవులు. వారికి అండగా నిలవాలనేది నా అభిలాష. వైద్య వృత్తిలో స్థిరపడి నిజాయతీగా పనిచేసి ప్రజలకు సేవలు చేయాలనేది లక్ష్యం. మా అమ్మనాన్నల కల కూడా అదే. దానిని నెరవేర్చేదిశగా చదువుల్లో ముందుకు సాగుతున్నా..’’

 - పైడి తేజేశ్వరరావు, 6వ ర్యాంకు

 

 పేదలకు సేవ చేస్తా..

 ‘‘తెలంగాణ ఎంసెట్‌లో మంచి ర్యాంకు వస్తుందన్న నమ్మకం మొదటి నుంచి ఉంది. ఓయూలో చదివి కార్డియాలజిస్ట్ కావడం నా లక్ష్యం. పేదలకు సేవ చేయాలని ఉంది.’’

     - నాగసత్య వరలక్ష్మి, 7వ ర్యాంకు

 

 మెడిసిన్ చదవాలని ఉంది

 ‘‘మంచి ర్యాంకు సాధించడం ఎంతో గర్వంగా ఉంది. జాతీయ స్థాయిలో ఏఐఎం, జిప్‌మర్‌లో మంచి ర్యాంకు సాధించి, జాతీయ స్థాయి సంస్థలో మెడిసిన్ చదవాలని ఉంది. అందుకోసం ముందస్తు ప్రణాళికతో సిద్ధమవుతున్నాను. ఇంటర్‌లో 987 మార్కులు వచ్చాయి. ఏపీ ఎంసెట్‌లో 20వ ర్యాంకు వచ్చింది..’’

 - బి.కీర్తన షణ్ముఖ, 8వ ర్యాంకు

 

 గొప్ప వైద్యుడిని కావాలని ఉంది

 ‘‘ న్యూరాలజిస్టు కావాలన్నదే నా లక్ష్యం. ఏపీ ఎంసెట్‌లో ఆరో ర్యాంకు సాధించా. మా అమ్మ, నాన్న, తాత వైద్యులే. వారి ప్రోత్సాహంతోనే మంచి ర్యాంకు సాధించా. మంచి వైద్యుడిని కావాలని ఉంది..’’

- అన్ష్‌గుప్తా, 9వ ర్యాంకు

 

సివిల్స్ సాధించడమే లక్ష్యం..

 ‘‘సివిల్స్ సాధించి దేశసేవ చేస్తా. ఐఏఎస్ కావడం నా చిన్నప్పటి కోరిక. ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేయాలనుంది.’’    

- సాయిప్రీతమ్, 10వ ర్యాంకు

 

 ఇంజనీరింగ్ విభాగం

 కంప్యూటర్ సైన్స్ చదువుతా..

 ‘‘ఎంసెట్‌లో మొదటి ర్యాంక్ సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. ఏపీ ఎంసెట్‌లో నాకు 6వ ర్యాంకు వచ్చింది. జేఈఈ మెయిన్స్‌లో 326 మార్కులు సాధించాను. ముంబై ఐఐటీ సీఎస్‌సీ చేస్తా...’’

 - మోపర్తి సాయి సందీప్, మొదటి ర్యాంకు

 

 మా నాన్నే స్ఫూర్తి..

 ‘‘ఎంసెట్‌లో రెండో ర్యాంక్ రావడం ఆనందంగా ఉంది. మా నాన్న నాగేశ్వరరావు నాకు స్ఫూర్తి. ఆయన అనుక్షణం నన్ను ప్రోత్సహించారు. ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ కోర్సు పూర్తి చేస్తా. సాఫ్ట్‌వేర్ సంస్థకు సీఈవో కావడమే లక్ష్యం..’’

- రౌతు నిహార్ చంద్ర, రెండో ర్యాంకు

 

 ఆనందంగా ఉంది

 ‘‘మాది విజయనగరం జిల్లా బొబ్బిలి. 3వ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది. మా నాన్న మెడికల్ ఏజెన్సీ నడుపుతున్నారు. ఏపీ ఎంసెట్‌లో 18వ ర్యాంకు వచ్చింది..’’    

 - బి.కీర్తన, 3వ ర్యాంకు

 

 ఐఐటీలో చదవాలని ఉంది..

 ‘‘ఐఐటీలో చేరి సాంకేతిక రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో కష్టపడి చదువుతున్నాను. 4వ ర్యాంకు సంతృప్తిని ఇచ్చింది.’’    

- జి.సాయితేజ, 4వ ర్యాంకు

 

 సేవ చేయాలని ఉంది

 ‘‘మంచి ర్యాంకు సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఈ విజయం సాధించా. ఇంటర్‌లో 978 మార్కులు వచ్చాయి. మంచి ఉద్యోగం చేస్తూ సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఉంది..’’    

- వి.హేమంత్ రెడ్డి, 5వ ర్యాంకు

 

 ఎమ్మెస్సీ చేస్తా..

 ‘‘తల్లిదండ్రులు, అధ్యాపకులు ప్రోత్సాహంతోనే 6వ ర్యాంకు సాధిం చాను. ఐఐటీలో చేరి ఎలక్ట్రికల్ ఇంజ నీరింగ్ చదవాలని ఉంది. ఆ తర్వాత ఎమ్మెస్సీ, ఎంబీయే చేయాలని నా కోరిక.’’    

 - తన్నీరు శ్రీహర్ష, 6వ ర్యాంకు

 

 గొప్ప ఇంజనీర్ కావాలనుంది

 ‘‘మా అమ్మ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. విజయనగరం జిల్లా ఎం.కొత్తవలస మా స్వస్థలం. గొప్ప ఇంజనీర్ కావాలని ఉంది..’’    

 - ఎం.సందీప్‌కుమార్, 7వ ర్యాంకు

 

 కంప్యూటర్ ఇంజనీర్ అవుతా..

 ‘‘ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ చేయడమే నా లక్ష్యం. 8వ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది. ఇంటర్‌లో 975 మార్కులు వచ్చాయి. ఏపీ ఎంసెట్‌లో 7వ ర్యాంకు సాధించా..’’    

 - గార్లపాటి శ్రీకర్, 8వ ర్యాంకు



 ఐఏఎస్ కావడమే లక్ష్యం..

 ‘‘ఐఏఎస్ కావడమే నా లక్ష్యం. ప్రస్తుతం ఐఐటీ ముంబైలో సీటు సాధించి చదువుతా.. ఆ తర్వాత సివిల్స్‌కు ప్రిపేర్ అవుతాను. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే మం చి ర్యాంకు సాధించాను.’’   

- అక్షిత్‌రెడ్డి, 9వ ర్యాంకు



 ముంబై ఐఐటీలో చేరుతా..

 ‘‘ఐఐటీ ముంబైలో చేరి కంప్యూటర్ సైన్స్ చదవాలనేది నా లక్ష్యం. ఏపీ ఎంసెట్‌లో మొదటి ర్యాంకు సాధించాను. ఇంటర్‌లో 971 మార్కులు వచ్చాయి..’’

- కె.అనిరుధ్‌రెడ్డి, పదో ర్యాంకు



Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top