ప్రాణాలు నిలుపుతున్న డ్రంకెన్‌డ్రైవ్‌


ఎల్లారెడ్డిపేట: పోలీసుల డ్రంకెన్‌ డ్రైవ్‌ ఆపరేషన్‌ వాహనదారుల ప్రాణాలు నిలుపుతోంది. పీకల దాక మద్యం తాగి వాహనాలు నడుపుతూ విలువైన ప్రాణాలను కోల్పోతుండగా పోలీస్‌ శాఖ గత కొంత కాలంగా కొనసాగిస్తున్న డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలు సత్ఫలితాలనిస్తున్నాయి. గతంతో పోల్చుకుంటే రోడ్డు ప్రమాదాలు 50శాతానికి తగ్గిపోయాయి. ఎల్లారెడ్డిపేట పోలీస్‌ సర్కిల్‌ పరిధిలోని వీర్నపల్లి, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట పోలీస్‌ స్టేషన్‌లలో ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ఐదు నెలల్లో 364 కేసులు నమోదయ్యాయి. మద్యం తాగి వాహనాలు నడుపడానికి వాహనదారులు ప్రస్తుతం జంకుతున్నారు. ఎక్కడ ఏ దారిలో పోలీసుల తనిఖీ లు ఉంటాయో అర్థం కాక తాగడానికే దూరమవుతున్నారు. పోలీసులు చేపట్టిన డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలు ఎందరో ప్రాణాలు కాపాడుతోంది.



మత్తు వందశాతం దాటితే జైలుకే..

వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నపుడు పోలీసులు బీత్‌ ఎనలైజర్‌ (తాగిన వారి శ్వాసతో మత్తును గుర్తించే పరికరం) మోతాదు 100యూనిట్లు దాటితే న్యాయమూర్తులు విచారించి తాగిన వారికి జైలు శిక్షలు అమలు చేస్తున్నారు. వందకంటే తక్కువ మోతాదు వస్తే రూ. 2వేల నుంచి రూ. 3వేల వరకు జరిమాన విధించి మొదటి తప్పుగా పరిగణిస్తూ వదిలిపెడుతున్నారు. ఇలా మూడు సార్లు పోలీసులకు మద్యం తాగి వాహనాలు నడుపుతూ దొరికితే వారి లైసెన్స్‌ రద్దుతో పాటు జైలు శిక్ష విధించి శిక్షిస్తున్నారు. పోలీసులు, కోర్టుల నుంచి కఠిన శిక్షలు అమలు చేస్తుండడంతో మద్యం తాగి వాహనాలు నడపడానికి భయపడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఎల్లారెడ్డిపేట సర్కిల్‌లో గంభీరావుపేట 115, వీర్నపల్లి 105, ఎల్లారెడ్డిపేట 144చొప్పున కేసులు నమోదు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top