కలెక్టర్ వేధింపులను భరించలేను
సీఎస్కు డీఆర్డీఓ అరుణ ఫిర్యాదు
సాక్షి, సంగారెడ్డి: అసభ్య పదజాలంతో దూషిస్తూ, వేధింపులకు గురిచేస్తున్న సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మాణిక్క రాజ్ కణ్ణన్ నుంచి రక్షణ కల్పించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డాక్టర్ అరుణ ప్రభుత్వాన్ని కోరారు. తాను కలెక్టర్ నుంచి ఎదుర్కొంటున్న ఒత్తిళ్లపై సీఎస్కు గురువారం ఫిర్యాదు చేశారు.
ఉపాధి హామీ పథకంలో నాటిన మొక్కలకు సంబంధించి 150 గ్రామాల్లో పరిస్థితి సరిగ్గా లేని విషయాన్ని తాను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లానన్నారు. సమస్యను పరిష్కరించాల్సిన కలెక్టర్.. 3 రోజుల్లో 9 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించారన్నారు. క్షేత్రస్థాయిలోని పరిస్థితుల నేపథ్యంలో లక్ష్యం సాధ్యం కాదని చెప్పడంతో తన విధుల్లో కోత విధించారన్నారు. తాను విధుల్లో చేరిన మూడు నెలల నుంచి కలెక్టర్ ఒత్తిడి పెంచుతున్నారని, తనకు రక్షణ కల్పించకుంటే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని అరుణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.