యువ శాస్త్రవేత్త పురస్కారానికి డాక్టర్ సతీష్ ఎంపిక


కేయూక్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ బాటనీ విభాగంలో  డాక్టరేట్ పూర్తిచేసిన డాక్టర్ సుతారి సతీష్ యువ శాస్త్రవేత్త పురస్కారానికి ఎంపికయ్యూరు. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు (ఎస్‌ఈఆర్‌బీ) డీఎస్‌టీ వారు ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. 2013లో పీహెచ్‌డీ చేసిన సతీష్ ఈ పురస్కారం అందుకోనుండడం విశేషం. గ్రేటర్ హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో పలు రకాల కాలుష్యాల వల్ల పర్యావరణంలో సంభవిస్తున్న మార్పులు... దానికనుగుణంగా మారుతున్న మొక్కల అనుక్రమం... సహజ, కాలుష్య ప్రాంతంలో పెరుగుతున్న మొక్కల అనుక్రమం వంటి పలు అంశాలపై 3 సంవత్సరాలపాటు పరిశోధన చేయనున్నారు.  



క్షేత్ర పర్యటనలో వెల్లడైన అంశాలను నివేదికను అందజేసి మార్గదర్శకాలను సూచిస్తారు. కేయూలోని బాటనీ విభాగంలో రిటైర్డ్ ప్రొఫెసర్ వత్సవాయ ఎస్ రాజు పర్యవేక్షణలో పీహెచ్‌డీ పూర్తిచేసిన సతీష్ అంతర్జాతీయ జర్నల్స్‌లో పది పరిశోధన పత్రాలు ప్రచురించారు.18 జాతీయ ,అంతర్జాతీయ సదస్సుల్లో పరిశోధన పత్రాలను సమర్పించారు.  2009 నుంచి 2011 వరకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ డెహ్రాడూన్ వారి ఫెల్లోషిప్, 2012-2013లో యూజీసీ న్యూఢిల్లీ నుంచి ఫెల్లోషిప్ అందుకున్నారు. ప్రస్తుతం యువశాస్త్రవేత్త పురస్కారంతో మరో మూడు సంవత్సరాలపాటు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో హైదరాబాద్‌లో ప్రముఖ శాస్త్రవేత్త సీనియర్ ఆచార్యులు ఎంఎన్‌వీ ప్రసాద్ ఆధ్వర్యంలో పరిశోధనలు చేయనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top