'కేసీఆర్ కు అహం అడ్డొస్తోంది'
మహబూబ్ నగర్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి వల్లే తెలంగాణ రాష్ట్రంలో 322 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మాజీ మంత్రి డీకే అరుణ విమర్శించారు. విద్యుత్ సమస్యలతో పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అరుణ మండిపడ్డారు. ఈ వాస్తవాన్ని అంగీకరించేందుకు కేసీఆర్ కు అహం అడ్డొస్తోందని ఆమె ఎద్దేవా చేశారు. దీనిపై సోమవారం మీడియాతో మాట్లాడిన డీకే అరుణ.. ఇది నిరంకుశ ప్రభుత్వమన్నారు. రైతుల ఆత్మహత్యలపై కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వకుండా దౌర్జన్యంగా అరెస్ట్ చేశారన్నారు. సీఎం సొంత సెగ్మెంట్ లోనే 18 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అరుణ విమర్శించారు.
సెంటిమెంట్ రాజకీయాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని కేసీఆర్ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. సమస్యలపై స్పందించకుండా మొద్దు నిద్రపోతున్న కేసీఆర్ సర్కారు కళ్లు తెరిపించడానికే ధర్నా చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. రైతులు ఆత్మస్దైర్యం కోల్పోవద్దని అరుణ తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వ్యవసాయానికి 8 గంటల కరెంటె వచ్చేలా చేస్తామని రైతులకు ఆమె భరోసా ఇచ్చారు.