‘మద్దతు' పొందండి..


- కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి

- 72 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు

- ‘ఏ' గ్రేడ్ క్వింటాల్ ధర రూ.1,400, సాధారణ రకానికి రూ.1,360

- జిల్లా వ్యాప్తంగా 180 కొనుగోలు కేంద్రాలు

- రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట రూరల్:
ధాన్యాన్ని ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని రాష్ట్ర మార్కెటింగ్, నీటిపారుదల శాఖల మంత్రి టి. హరీశ్‌రావు రైతులకు సూచించారు. ఆదివారం సిద్దిపేట మండలం పొన్నాల గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గ్రేడ్-ఏ ధాన్యం క్వింటాల్ ధర రూ.1,400, సాధారణ రకం రూ.1,360గా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.



రబీ దిగుబడుల కొనుగోలుకు జిల్లాలో ఐకేపీ, సొసైటీలు సుమారు 180 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్టు తెలిపారు. రైతులంతా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయిస్తే గత ఖరీఫ్‌లో ఇచ్చినట్టుగా 72 గంటల్లో డబ్బులు తమ ఖాతాల్లో జమ చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. సిద్దిపేటలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని సుమారు 60 రైస్ మిల్లులకు పంపించనున్నట్లు తెలిపారు.



పొద్దుతిరుగుడుకు రూ.3,750 మద్దతు ధర కల్పిస్తూ సిద్దిపేటలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పొన్నాల కొనుగోలు కేంద్రంలో రూ.50 లక్షలతో ప్లాట్‌ఫారాలు ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఎంపీపీ యాదయ్య, ఏపీఎం ధర్మసాగర్, సర్పంచ్ సాదుపల్లి శివప్రసాద్ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top