'ఎన్టీఆర్ పేరు'పై కోర్టులో తేల్చుకుంటాం!
హైదరాబాద్:శంషాబాద్ డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టే అంశంపై కోర్టులో తేల్చుకుంటామని రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఒకే టెర్మినల్ కు, ఒకే బిల్డింగ్ కు రెండో పేరు ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్లో ఆదివారం నిర్వహించిన మైనారిటీ సమ్మేళనంలో దిగ్విజయ్ మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఎమ్మెల్యేల ఫిరాయింపులు ప్రోత్సహిస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారన్నారు. ఈ అంశంపై కూడా కోర్టుకు వెళతామన్నారు. ఫిరాయింపు నిరోధక పిటిషన్ లను స్పీకర్లు, ఛైర్మన్లు గడువులోగా పరిశీలించేలా చట్టాన్ని సవరించాలన్నారు.
మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎంఐఎం సమర్ధిస్తోందని దిగ్విజయ్ విమర్శించారు. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ విశ్వాస పరీక్షకు ఎంఐఎం దూరంగా ఉండి బీజేపీకి పరోక్షంగా మద్దతు తెలిపిందన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బీజేపీని గెలిపించేందుకు అక్కడ ఎంఐఎం పోటీ చేసే యోచనలో ఉందన్నారు. డిసెంబర్ 9 నుంచి 16 వరకూ నేతలంతా ఓటు హక్కు ఉన్న పోలింగ్ బూత్ లోనే సభ్యత్వ నమోదు నిర్వహించాలన్నారు.