మేడారం జాతరపై కడియం సమీక్ష
భూపాలపల్లి: ప్రభుత్వం నుంచి నిధుల మంజూరవ్వగానే పనులు ప్రారంభించి 2018 జనవరి 15 తేదీ వరకు మేడారం జాతర పనులు పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో 2018 ఫిబ్రవరిలో జరిగే సమ్మక్క- సారలమ్మ జాతరపై ఆయన వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమ్మక్క జాతరను జాతీయ పండగగా గుర్తించాలని కోరుతూ స్థానిక ప్రజాప్రతినిధులు, పూజారులు ఈ సందర్భంగా తీర్మానం చేశారు. దీన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆయన ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తామని హామీ ఇచ్చారు. సమావేశానికి ప్రిన్సిపల్ సెక్రటరీ మహేష్ దత్ ఎక్కా కూడా విచ్చేశారు. జాతర నిధుల మంజూరు జీవోను పది రోజుల్లో జారీ చేస్తామని ఆయన తెలిపారు.