ఎస్పీ సుమతి డెకాయ్ ఆపరేషన్

విలేకరులతో మాట్లాడుతున్న మెదక్ జిల్లా ఎస్పీ సుమతి


తూప్రాన్: దాబా హోటళ్లలో మద్యం సిట్టింగ్, విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని మెదక్ జిల్లా ఎస్పీ సుమతి హెచ్చరించారు. తూప్రాన్‌లోని దాబా హోటళ్లపై బుధవారం రాత్రి 10 సమయంలో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. పట్టణంలోని బైపాస్ మార్గంలో సన్‌దాబాలో మద్యం సిట్టింగ్‌లను గమనించిన ఎస్సీ వెంటనే తన వాహనాన్ని పక్కన పెట్టించి సివిల్ డ్రెస్‌లో ఉన్న తన గన్‌మెన్‌లను దాబా హోటల్‌కు పంపించి మద్యం కొనుగోలు చేయమని ఆదేశించారు. దీంతో తన సిబ్బంది వెంటనే దాబాలోకి ప్రయాణికుల మాదిరిగా వెళ్లారు.



తమకు మద్యం కావాలని కోరడంతో దాబా నిర్వహకుడు బ్లెండర్‌స్పైడ్ మద్యం బాటిల్‌ను విక్రయించాడు. వెంటనే రంగంలోకి దిగిన ఎస్సీ సుమతి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్థానిక డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ.సంతోష్‌కుమార్‌లు హూటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని దాబా నిర్వహకుణ్ని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఎస్పీ నేరుగా పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని రికార్డులను తనిఖీ చేశారు.



అనంతరం డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. నేరాలు, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాల గురించి డీఎస్పీని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దాబా హోటళ్లలో మద్యం విక్రయించినా, సిట్టింగ్‌లను నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే బెల్ట్ షాపులు నిర్వహించి వారిపై సైతం కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే గతంలో తూప్రాన్‌లోని పలు దాబాలపై పోలీసులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసినా వారిలో మార్పు రాకపోవడం గమనార్హం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top