మృతదేహాన్ని పీక్కుతిన్న పందికొక్కులు

మృతదేహాన్ని పీక్కుతిన్న పందికొక్కులు


కామారెడ్డి: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చిన రోగులను వైద్య సిబ్బంది లంచాల రూపంలో హడలెత్తిస్తుంటే... మరోవైపు పోస్ట్మార్టం నిర్వహించిన మృతదేహాలను మార్చురీలో పందికొక్కులు పీక్కుతింటున్నాయి. అలా మృతదేహన్ని పందికొక్కులు పీక్కుతిన్న హృదయ విదారక సంఘటన నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లాలోని సొంతూరు మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఎర్ల పండరి వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని గురువారం పంది ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పండరి అక్కడికక్కడే మరణించాడు.



అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పండరి మృతదేహన్ని ఆసుపత్రికి తరలించారు. పండరి మరణించినట్లు వైద్యులు దృవీకరించి... పోస్ట్ మార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహన్ని మార్చురీకి తరలించారు. అయితే పండరీ కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం ఆసుపత్రికి చేరుకున్నారు. మృతదేహన్ని తమకు చూపించాలని డిమాండ్ చేయడంతో సిబ్బంది మృతదేహాన్ని మార్చురీలో నుంచి బయటకు తీసుకువచ్చారు. అయితే మృతదేహం ముఖం ఛిద్రంగా తయారైంది. ఇదేమిటని పండరి కుటుంబసభ్యుల ప్రశ్నించగా.. పందికొక్కులు పీక్కుతిన్నాయని సిబ్బంది వెల్లడించారు. దాంతో పండరీ కుటుంబసభ్యులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని వారు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రికత్త వాతావరణం నెలకొంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top