సైబరాబాద్ విభజన బిల్లుకు ఓకే
• దేవాలయాల పాలకమండళ్ల సభ్యుల పెంపునకూ శాసనసభ, మండలి ఆమోదం
• పరిపాలనా సౌలభ్యం కోసమే సైబరాబాద్ విభజన: హోంమంత్రి
• జిల్లాల పునర్విభజన అయ్యాక చేస్తే బాగుంటుందన్న విపక్షాలు
• పాలకమండళ్ల చైర్మన్ పదవుల్లో 33 శాతం మహిళలకు: కాంగ్రెస్
• వ్యాట్ సవరణ బిల్లును కూడా ఆమోదించిన ఉభయ సభలు
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ విభజన బిల్లు, దేవాలయాల పాలక మండళ్ల సభ్యుల సంఖ్య పెంపు, వ్యాట్ సవరణ బిల్లులకు మంగళవారం శాసనసభ, శాసన మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలి పాయి. సైబరాబాద్ కమిషనరేట్ విభజన బిల్లును హోంమంత్రి నాయిని న ర్సింహారెడ్డి ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు. పరిపాలనా సౌలభ్యం కోసమే ఈ విభజన చేపట్టామని వివరించారు. 2004లో ఇక్కడ జనాభా 20 లక్షలుకాగా, ప్రస్తుతం 60 లక్షలకు పెరిగిం దని.. పోలీస్స్టేషన్ల సంఖ్య సైతం పెరిగిందని చెప్పారు. అందువల్ల కొన్ని ఇతర ప్రాంతాలను కలుపుతూ కొత్త కమిషనరేట్లను ఏర్పా టు చేస్తున్నామన్నారు. సైబరాబాద్ ఈస్ట్కు రాచకొండ కమిషనరేట్గా నామకరణం చేశామన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ విభజ నను బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి తప్పుపట్టారు. కొత్త జిల్లాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్న తరుణంలో సైబరాబాద్ను హడావుడిగా విభజించడం ఏమిటని ప్రశ్నించారు. కొత్త జిల్లాలకు అనుగుణంగానే సైబరాబాద్ విభజన జరగాలని.. ప్రతి నియోజకవర్గం ఒక ఏసీపీ పరిధిలోకి వచ్చేలా పునర్వ్యవస్థీకరణ జరగాలని సూచించారు. ఇక సైబరాబాద్ కమిషనరేట్ విభజన గురించి అభ్యంతరం లేనప్పటికీ నల్లగొండ జిల్లాలోని వలిగొండ మండలాన్ని కలపడం సరికాదని మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ రాజగోపాల్రెడ్డి విమర్శిం చారు. కమిషనరేట్ల విభజన ప్రక్రియలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయకపోవడం సరికాదన్నారు.
పెద్ద దేవాలయాల్లో 14 మంది..
దేవాలయాల పాలక మండళ్ల సభ్యుల సంఖ్య పెంపు బిల్లును దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రవేశపెట్టారు. రూ.25లక్షలకుపైగా ఆదాయమున్న దేవాలయాల్లో పాలక మండలి సభ్యుల సంఖ్యను 9 నుంచి 14కు పెంచుతున్నట్లు తెలిపారు. రూ.25 లక్షలకన్నా తక్కువున్న చోట ఏడుగురు, రూ.2 లక్షలకు తక్కువుంటే ఐదుగురు సభ్యులు ఉంటారన్నారు. భక్తులకు మెరుగైన సేవలు, ఆలయాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆయా కమిటీల్లో తప్పనిసరిగా ఎస్సీ/ఎస్టీ వర్గాల నుంచి ఒకరు, బీసీ, మహిళల కేటగిరీల నుంచి ఒకరు చొప్పున సభ్యులుగా ఉంటారని వెల్లడించారు. దేవాలయాల అభివృద్ధి కోసం కామన్ గుడ్ ఫండ్ కింద బడ్జెట్లో రూ.50కోట్లు కేటాయించామని తెలిపారు.
అయితే పాలక మండళ్ల చైర్మన్ పదవుల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత టి.జీవన్రెడ్డి అసెంబ్లీలో కోరారు. పాలక మండలి సభ్యులుగా రాజకీయ నిరుద్యోగులకే అవకాశమిస్తున్నారని.. అలాకాకుండా నిజంగా దేవాలయాలను కాపాడే వారికి ఇవ్వాలని సూచిం చారు. ఈ సమయంలో పార్టీ ఫిరాయింపుల అంశాన్ని ప్రస్తావిస్తూ.. విపక్షాల సభ్యులను స్పీకర్ సమక్షంలోనే కండువాలు కప్పి మరీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. దీంతో మంత్రి హరీశ్రావు జోక్యం చేసుకుని.. చర్చ జరుగుతున్న అంశానికే పరిమితం కావాలని జీవన్రెడ్డికి సూచిం చారు.
ఇక మండలిలో జరిగిన చర్చ సందర్భంగా పాలక మండలి సభ్యుల నియామకంలో రిజర్వేషన్లను వర్తింపజేయాలని.. నాస్తికులను, వైన్షాపుల నిర్వాహకులను సభ్యులుగా నియమించవద్దని ఎమ్మెల్సీలు ఆకుల లలిత, ఎం.ఎస్.ప్రభాకర్ సూచిం చారు. ఆలయాల పవిత్రతను పెంచేలా సభ్యుల నియామకం ఉండాలని, రాజకీయ నిరుద్యోగులను సంతృప్తి పరచడానికి కాదని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి పేర్కొన్నారు. ఇక వ్యాట్ సవరణ బిల్లును మంత్రి హరీశ్రావు ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు. రాష్ట్రానికి వస్తున్న కొత్త వస్తువులపై పన్ను విధించేందుకే ‘స్టేట్ లెవల్ అథారిటీ ఫర్ క్లారిఫికేషన్ బిల్లు’కు సవరణ చేస్తున్నామని, ఇది జీఎస్టీ అమల్లోకి వచ్చే వరకు మాత్రమే వర్తిస్తుందని వివరించారు. పన్ను విధానాలను పరిశీలించేందుకు రాష్ట్ర స్థాయి అథారిటీ ఏర్పాటవుతుందని తెలిపారు. ఈ బిల్లుకు శాసనసభ, మండలి ఆమోదం తెలిపాయి.