కబ్జాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు
- చెరువులు, నాలాలను పరిరక్షిస్తాం మంత్రి హరీష్రావు
అల్వాల్ : చెరువులు, నాలాలు, శిఖం భూములను కబ్జా చేస్తే సహించేదిలేదని, అవసరమైతే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్రావు అన్నారు. అల్వాల్ చిన్నరాయుని చెరువులో వీడ్ హార్వెస్టర్ యంత్రం ద్వారా మొట్ట మొదటి సారిగా చేపడుతున్న గుర్రపుడెక్క, వ్యర్ధ పదార్థాల తొలగింపు కార్యక్రమాన్ని ఆయన మంత్రి నాయిని నర్సిం హారెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్కుమార్తో కలసి శనివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో చెరువులు, కుంటలు పెద్దఎత్తున దురాక్రమణకు గురవుతున్నాయని, దీనివల్ల నీటి పారుదల వ్యవస్థ పాడైపోవడంతో పాటు భూగర్భ జలాల మట్టం దారుణంగా పడిపోయిందన్నారు. ఇందు కోసమే చెరువులు, కుంటలకు పూర్వ వైభవం తీసుకరావడానికి సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. గ్రేటర్లోని 169 చెరువులను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. చిన్నరాయుని చెరువు అభివృద్ధికి కోటీ 50 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ చెరువుల పరిరక్షణకు ప్రజలు కూడా భాగస్వాములు కావాని పిలుపు నిచ్చారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి, చీఫ్ ఇంజనీర్ సురేష్కుమార్, జోనల్ కమిషనర్ హరిచందన, సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సరోజ టీఆర్ఎస్ గ్రేటర్ అధ్యక్షులు మైనంపల్లి హన్మంతరావు పాల్గొన్నారు.