సీపీఎం నేతకు కన్నీటి వీడ్కోలు
‘గూడెం’లో పర్సా అంత్యక్రియలు
కొత్తగూడెం: తొలితరం కార్మికోద్యమనేత, ఖమ్మం జిల్లాకు చెందిన సీపీఎం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పర్సా సత్యనారాయణకు శనివారం కన్నీటి వీడ్కోలు పలికారు. ఉదయం 10 గంటల వరకు ఆయన పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఉంచారు. ప్రజలు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి వచ్చి పర్సాకు నివాళులర్పించారు.
సీపీఎం ఆఫీసు నుంచి అంతిమ యాత్ర ప్రారంభంకాగా, హిందూ శ్మశానవాటి కలో పర్సా అంత్యక్రియలు జరిగాయి. సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం, సత్తుపల్లి, భద్రాచలం ఎమ్మెల్యేలు జలగం వెంకటరావు, సండ్ర వెంకటవీరయ్య, సున్నం రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.