ఆరోగ్యశ్రీ సిబ్బందితో చర్చించి సమస్య పరిష్కరించాలి : సీపీఐ
హైదరాబాద్ : ఆరోగ్యశ్రీ క్షేత్రస్థాయి సిబ్బంది సమస్యల పరిష్కారానికి వెంటనే వారితో చర్చించి సమ్మె పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్కు సీపీఐ విజ్ఞప్తి చేసింది. ఈ ఉద్యోగుల సమ్మెతో సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, సమ్మె చేస్తున్న సిబ్బంది న్యాయమైన కోర్కెల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరింది. ఈమేరకు మంగళవారం సీఎంకు సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఒక లేఖ రాస్తూ వేతనాలను సవరించాలని, ఉద్యోగ భద్రతను కల్పించాలని, దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తున్న ఉద్యోగులతో చర్చలు జరపాలన్నారు.
ఆరోగ్యశ్రీ పథకంలో క్షేత్రస్థాయి విధులు నిర్వహిస్తున్న ఆరోగ్యమిత్ర, పీహెచ్సీ, నెట్వర్క్ ఆరోగ్య మిత్రలు, డివిజనల్ టీమ్ లీడర్లు, ఆఫీసు అసోసియేట్స్, ట్రస్ట్ ఆఫీసులో పని చేసే డీఈఓలు వంటి వారు చాలీచాలని వేతనాలతో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న విషయం తెలిసిందేనన్నారు.