భార్యను హతమార్చి..భర్త ఆత్మహత్య
మహేశ్వరం (రంగారెడ్డి): కుటుంబ కలహాలు భార్యాభర్తలను బలిగొన్నాయి. భార్యను ఉరివేసి చంపాడు.. ఆపై తానూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... మహేశ్వరం మండలం హర్షగూడ గ్రామానికి చెందిన మూడావత్ కృష్ణ(35)కు అదే గ్రామానికి చెందిన మూడావతి దోలి(30)తో పెళ్లైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. లారీ డ్రైవర్గా పని చేసే కృష్ణ తాగుడుకు బానిసై భార్యను వేధించేవాడు. కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోన్న దోలిని తరచూ భర్త కొట్టేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుండటంతో దోలి తల్లిగారింటికి వెళ్లింది.
విషయం తెలుసుకున్న కృష్ణ మంగళవారం సాయంత్రం అత్తగారింటికి వెళ్లి భార్యపై చేయి చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా భార్యను ఉరేసి చంపాడు. అనంతరం కృష్ణ కూడా ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్యాభర్తలు మృతిచెందడంతో ముగ్గురు పిల్లలూ అనాథలయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.