రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి - Sakshi


శంషాబాద్ రూరల్: రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో దంపతులు దుర్మరణం చెందగా ఓ ఇంజినీరింగ్ విద్యార్థికి గాయాలయ్యాయి. మండల పరిధిలోని షాబాద్ రోడ్డులో ఒయాసిస్ పాఠశాల వద్ద ఆదివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ మండలం పెద్దవేడు తండాకు చెందిన కేతావత్ నర్సింహా(42), శాంతి(38) దంపతులు రాత్రి శంషాబాద్ నుంచి బైక్‌పై స్వగ్రామానికి వెళ్తున్నారు.



ఇదే సమయంలో శంషాబాద్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి సాయికిరణ్(19)బైక్‌పై వర్ధమాన్ కళాశాల నుంచి శంషాబాద్ వస్తున్నాడు. మార్గమధ్యంలో ఒయాసిస్ పాఠశాల వద్దకు రాగానే వీరి రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన నర్సింహా, శాంతి దంపతులు ఘటనా స్థలంలో దుర్మరణం పాలయ్యారు. మరో బైక్‌పై ఉన్న సాయికిరణ్‌కు గాయాలవడంతో 108 వాహనంలో  చికిత్స కోసం శంషాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.



కాగా నర్సింహా దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. వీరికి ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. దంపతుల మృతి విషయం తెలుసుకున్న కుటుంబీకులు, తండావాసులు ఘటనా స్థలానికి పెద్దఎత్తున చేరు కున్నారు. ఘటనా స్థలంలో వారి రోదనలు మిన్నం టాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక క్లస్టర్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈమేరకు శంషాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top