దంపతులకు పాము కాటు


మేడ్చల్ (రంగారెడ్డి) : గుడిసెలో నిద్రిస్తున్న దంపతులను పాము కాటేయడంతో వారి పరిస్థితి విషమంగా మారింది. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం కండ్లకోయలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం భోలక్‌పూర్‌కు చెందిన హజారుల్లా(50), నిషా(45) దంపతులు కొన్నేళ్ల క్రితం కండ్లకోయకు వలస వచ్చారు. మేడ్చల్ మార్కెట్‌కు వెళ్లే దారిలో గుడిసె వేసుకుని టీ స్టాల్ నిర్వహిస్తున్నారు. వారి కుమారుడు షాకీర్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. కాగా దంపతులు ఆదివారం రాత్రి హోటల్ మూసివేసి భోజనం చేసి నిద్రించారు.



అయితే అర్ధరాత్రి దాటాక నిషా ఒక్కసారిగా మంట.. మంట అంటూ కేకలు వేసింది. హజారుల్లా నిద్ర లేచి చూడగా నిషా దగ్గర పాము కనిపించింది. పామును హజారుల్లా తరుముతుండగా ఆయన్ను కూడా కాటేసింది. దంపతుల కేకలకు పక్కనే ఉన్న ట్రాన్స్‌పోర్ట్ సిబ్బంది వచ్చి చూశారు. దంపతుల కాళ్లపై పాము కాటేసిన ఆనవాళ్లు కనిపించడంతో 108 వాహనంలో నగర శివారులోని ఆర్‌ఆర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో నిషా కోలుకుంటుండగా హజారుల్లా పరిస్థితి విషమంగా ఉందని దంపతుల కుమారుడు షాకీర్ తెలిపాడు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top