లాభసాటిగా వ్యవసాయం: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖమంత్రి కె.తారక రామారావు అన్నారు. కరీంనగర్ జిల్లా నుంచి వచ్చిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులతో బుధవారం సచివాలయంలో ఆయన సమావేశమయ్యారు. వ్యవసాయ ఖర్చులను తగ్గించేందుకు పలు రకాల సబ్సిడీలు, ఉత్పత్తుల నిల్వకు గోడౌన్లు, మార్కెటింగ్ వసతి కల్పిస్తున్నామన్నారు. తమకు కూడా గౌరవ వేతనాలను పెంచాలంటూ సహకార సంఘాల అధ్యక్షులు మంత్రి కేటీఆర్ దృష్టికి తెచ్చారు. దీనిని సీఎం దృష్టికి తీసుకెళతానని మంత్రి హామీ ఇచ్చారు. గ్రామీణాభివృద్ధి పథకాల అమల్లో సహకార సంఘాల సేవల వినియోగాన్ని పరిశీలిస్తామని చెప్పారు.