అవినీతి ఎస్టీవో

అవినీతి ఎస్టీవో - Sakshi


రూ.3 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వైనం

ఆపై డబ్బులు తీసుకోలేదని బుకాయింపు

 కరీంనగర్ క్రైం : ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. బుధవారం కరీంనగర్ సబ్ ట్రెజరీ కార్యాలయ అధికారి(ఎస్టీవో) నాగెల్లి దేవేందర్ చొప్పదండి మండలం గుమ్లాపూర్ సర్పంచ్ ముస్కు వెంకటరెడ్డి నుంచి రూ.3వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. గ్రామ పంచాయతీకి సంబంధించిన రూ.60, 900 ఇచ్చేందుకు ఎస్టీవో సర్పంచ్ నుంచి లంచం తీసుకోగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ పట్టుకున్నారు.  సిబ్బంది వేతనాలు, స్టేషనరీ, వీధి దీపాల ఏర్పాటు కోసం గ్రామ పంచాయతీకి రూ.60,900 రావాల్సి ఉంది. వాటిని విడిపించేందుకు సర్పంచ్ వెంకటరెడ్డి కొద్ది రోజులుగా ఎస్టీవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయినా ఎస్టీవో దేవేందర్ బిల్లు పాస్ చేయడంలేదు. వి



సిగి వేసారిన సన్పంచ్ ఇదేమని నిలదీయగా రూ.4వేలు లంచం ఇస్తేనే బిల్లు పాస్ చేయిస్తానని ఖరాకండీగా చెప్పాడు. రూ.3వేలు ఇస్తానని, బిల్లు పాస్ చేయించాలని సర్పంచ్ ప్రాదేయపడ్డాడు. ఇందుకు ఎస్టీవో ఒప్పుకున్నాడు. దీంతో సర్పంచ్ బుధవారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో సదరు డబ్బులు ఎస్టీవోకు ముట్టజెప్పాడు. వాటిని టేబుల్‌డ్రాయర్‌లో వేసి వెళ్లాలని సూచించాడు. ఆయన చెప్పినట్టుగానే సర్పంచ్ డబ్బులు అక్కడ పెట్టగానే ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ వచ్చి పట్టుకున్నారు. దేవేందర్‌పై ఇప్పటికే అవినీతి ఆరోపణలున్నాయని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.



పాతుకుపోయిన అవినీతి

జిల్లాలోని ఎస్టీవో కార్యాలయాల్లో అవినీతి పాతుకుపోయింది. డబ్బులతో ముడి పడి ఉండే శాఖ కావడంతో ప్రతి పనికీ ఇంత అని రేట్ నిర్ణయించి వసూళ్లు చేస్తున్నారు. కరీంనగర్‌లోని ఎస్టీవో కార్యాలయంలో అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారనేందుకు తాజా ఉదంతమే నిదర్శనం. కొత్తగా ఎన్నికైన సర్పంచుల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఏపని కోసం వచ్చినా ఎంతో కొంత ముట్టచెబితేనే పనులు చేస్తున్నారు. గ్రామ పంచాయతీలకు సంబంధించిన బిల్లులు పాస్ కావాలంటే అందులో నుంచి 6 శాతం లంచం ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారని పలువురు మాజీ సర్పంచులు అంటున్నారు.

 

గతంలోనూ డబ్బులు ఇచ్చా..


గతంలో రూ.57 వేలు, రూ.55 వేలు, రూ.60 వేలు, రూ.66 వేలకు పైగా ఉన్న నాలుగు బిల్లులు మంజూరు చేశారు. వీటికి కూడా రూ.5 వేలు ఒకసారి, నాలుగుసార్లు రూ.3వేల చొప్పున ఇచ్చాను. ఇప్పటికే డబ్బులు ఇచ్చానని, ఈసారి బిల్లు పాస్ చేయాలని వేడుకున్నా లంచం ఇవ్వనిదే చేయనన్నాడు. అందుకే ఏసీబీకి పట్టించా.                                         -ముస్కు వెంకటరెడ్డి, బాధితుడు

 

అన్యాయంగా ఇరికించారు..

నాకు ఈ డబ్బులతో సంబంధం లేదు. నా డ్రాలో ఎవరో ఉద్దేశపూర్వకంగా డబ్బులు పెట్టి ఏసీబీకి పట్టించారు. నేను డబ్బులు తీసుకోలేదు. ప్రతి శాఖలో అవినీతి ఉంది, పోలీస్, రెవెన్యూతో పాటు కలెక్టరేట్‌లోని ప్రతి కార్యాయంలో డబ్బులు తీసుకుంటున్నారు. ఒక్క మా కార్యాలయే దొరికిందా.. నన్ను అన్యాయంగా బలి చేశారు.                          - నాగెళ్లి దేవేందర్, ఎస్టీవో

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top