చార్జీల పెంపుపై కాంగ్రెస్ ఆగ్రహం

చార్జీల పెంపుపై కాంగ్రెస్ ఆగ్రహం - Sakshi


విద్యుత్‌సౌధ వద్ద నేతల ధర్నా




హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్, బస్సు చార్జీలను పెంచడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. శనివారం విద్యుత్‌సౌధ ఎదుట పార్టీ సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, సర్వే సత్యనారాయణ, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, కూన శ్రీశైలంగౌడ్...నాంపల్లి చౌరస్తాలో అంజన్‌కుమార్‌యాదవ్, మల్లు రవి, శ్రీధర్‌బాబు తదితరులతో పాటు భారీ ఎత్తున కార్యకర్తలు బైటాయించి నిరసన తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. రోడ్డుపై బైటాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు నాయకులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పొన్నాల లక్ష్మయ్య, సుధీర్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డిలు మాట్లాడుతూ... ప్రజావ్యతిరేక ప్రభుత్వం పతనం కాక తప్పదన్నారు. పన్నుల భారం వేయమని చెప్పిన సీఎం, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.


 

గాంధీభవన్ నుంచి ర్యాలీ...


చార్జీల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్ నుంచి తాజ్ ఐల్యాండ్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. సీనియర్ నాయకులు శ్రీధర్‌బాబు, అంజన్‌కుమార్ యాదవ్, మల్లు రవి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సుమారు గంటపాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి బేగంబజార్ స్టేషన్‌కు తరలించారు. 


 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top