సికింద్రాబాద్లో సోనియా సభ పెట్టివుంటే...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కాంగ్రెస్ కృషేనంటూ సికింద్రాబాద్లో సోనియా సభ నిర్వహించివుంటే కాంగ్రెస్ ఇమేజ్ పెరిగి ఉండేదని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఆలస్యం కావడంతో ఎన్నికల్లో తమ పార్టీకి నష్టం వాటిల్లిందని అన్నారు. టీఆర్ఎస్ మాదిరిగా రుణమాఫీ పథకాన్ని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టకపోవడం దెబ్బతీసిందని పేర్కొన్నారు. కొందరు నేతలు పార్టీని వీడినా కార్యకర్తలు మాత్రం ఇంకా కాంగ్రెస్ పట్ల అంకితభావంతో ఉన్నారని చెప్పారు.
2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రోజే విద్యుత్ బకాయిల మాఫీ, ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేశామని గుర్తు చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలలైనా ఇంకా హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నాయకత్వంలో మంగళవారం గాంధీభవన్ లో జరిగిన 'ఎన్నికల ఫలితాలు, పార్టీ పునర్వ్యవస్థీకరణ' చర్చలో షబ్బీర్ అలీ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.