కిటకిటలాడిన ‘ఈ -ప్రజావాణి’


ప్రగతినగర్ : జిల్లా కేంద్రంలో సోమవారం  ‘ఈ- ప్రజావాణి’ ప్రారంభమైంది. ఇందుకోసం ప్రత్యేక కౌంటర్, ఆసరా పింఛన్‌ల కోసం మరో రెండు కౌంటర్లను ఏర్పాటు చేసి, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.ఆ ఫిర్యాదులను సంబంధిత మండల అధికారులకు, ఆయా శాఖలకు స్కానింగ్ చేసి పంపించారు. ఫిర్యాదులను జిల్లా కలెక్టర్‌తో పాటు,అదనపు జేసీ శేషాద్రి,డీఆర్వో మనోహర్ స్వీకరించారు. మొత్తం 241 ఫిర్యాదులు రాగా, పింఛన్ కోసం 778 వినతులు వచ్చాయి.



న్యాయం చేయండి...

తమకు తెలియకుండా ఎస్సీ కార్పొరేషన్ రుణాలను మాజీ సర్పంచ్ జక్కసాయన్న తమ సంతకాలను ఫోర్జరీ చేసి డబ్బులు డ్రా చేసుకున్నారని, తమకు న్యాయం చేయాలని బాల్కొండ మండలం బోదేపల్లికి చెందిన పలువురు లబ్ధిదారులు ఆరోపించారు. ఈ మేరకు వారు కలెక్టర్‌ను కలిసి కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు.



‘ఈ-పంచాయతీ’ మాకొద్దు.

ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెడుతున్న ‘ఈ-పంచాయతీ’ల వల్ల తమ సర్వీసులు దెబ్బతింటాయని మీ-సేవ నిర్వాహకులు జిల్లా కలెక్టర్‌కు కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీ-సేవలో గల సర్వీసులను ఈ పంచాయతీలకు మార్చటం వల్ల  మీ సేవ కేంద్రాలను మూసుకోవల్సిన పరిస్థితులు తలెత్తుతాయన్నారు.

 

‘జాతరగా కలెక్టరేట్’

కలెక్టరేట్ ప్రాంగణమంతా జాతరను తలపించింది.ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆసరా పథకానికి  దరఖాస్తులు పెరగడంతో జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. అక్కడే టెంట్లు ,నీటి సౌకర్యం కల్పించారు. గత రెండు వారాలుగా ఆసరా పథకం కోసం దరఖాస్తుదారుల సంఖ్య పెరగడంతో కలెక్టరేట్‌లో ప్రత్యేక కౌంటర్లు,సిబ్బందిని ఏర్పాటు చేశారు.వచ్చిన దరఖాస్తును వచ్చినట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top