ఎటు వైపు వెళ్దాం కామ్రేడ్..!
- దేవీప్రసాద్కు మద్దతుపై ‘లెఫ్ట్’లో కుదరని ఏకాభిప్రాయం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్,మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలనే విషయంపై వామపక్షాలు ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాయి. ఒకటి,రెండు రోజుల్లో 10 వామపక్ష పార్టీలు మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకోనున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ మద్దతుతో టీఎన్జీవో నేత దేవీప్రసాద్, బీజేపీ పక్షాన ఎన్.రామచంద్రరావు పోటీ చేస్తున్న నేపథ్యంలో తటస్థంగా ఉండాలా లేక ఎవరికైనా మద్దతు ఇవ్వాలా అన్నది వామపక్షాలు ఇంకా నిర్ణయించుకోలేదు. అయితే సీపీఐ మాత్రం బీజేపీని ఓడించాలంటే టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని భావిస్తోంది.
గురువారం మఖ్దూం భవన్లో జరిగిన సీపీఐ భేటీ లో ఈ అంశం చర్చకు రాగా.. మరోసారి సమావేశమై మద్దతుపై తుది నిర్ణయం తీసుకోవాలని నేతలు నిర్ణయించారు. కాగా, సీపీఎం ఈ స్థానం నుంచి తమ అభ్యర్థిగా జనార్దనరెడ్డిని నిలిపి, మిగతా వామపక్షాల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేసినా ఆ పార్టీలు ఇందుకు అంగీకరించలేదు. దీంతో సీపీఎం తన ప్రతిపాదనను విరమించుకుంది.