కేసీఆరే బాహుబలి: కడియం

కేసీఆరే  బాహుబలి: కడియం


హన్మకొండ: ‘మా నాయకుడు సీఎం కేసీఆరే బాహుబలి.. ఆయనకు ఎదురు వచ్చే వారే లేరు’ అని ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి అన్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలో ఆదివారం టీఆర్‌ఎస్‌ వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఇందులో కడియం మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కి ఎజెండా అంటూ లేదన్నారు. ఆ పార్టీకి నాయకత్వమే లేనప్పుడు.. బాహుబలి ఎక్కడి నుంచి వస్తారని ప్రశ్నించారు. ఇక కమ్యూనిస్టులను ప్రజలు విశ్వసించరని, టీడీపీ తెలంగాణలో కనుమరుగైన పార్టీ అన్నారు.



 కేంద్ర బడ్జెట్‌లో ప్లాన్, నాన్‌ ప్లాన్‌ను తీసివేయడంతో ఎస్సీలకు ప్రత్యేక ఉప ప్రణాళిక అమలు చేసే అవకాశం లేకుండా పోయిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ తీసుకువచ్చిందన్నారు. ఈ మేరకు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం తీసుకురానున్నట్లు చెప్పారు. ఎంపీ బి.వినోద్‌కుమార్, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top