మరోసారి ఇంజనీరింగ్ కాలేజీల్లో తనిఖీలు
హైదరాబాద్ : విద్యార్థుల కోసమే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం... యాజమాన్యాల కోసం కాదని తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. రాష్ట్రంలో నాణ్యత కలిగిన ఇంజనీరింగ్ విద్యను మాత్రమే ప్రోత్సహించాలన్నదే తమ ప్రభుత్వ భావన అని ఆయన తెలిపారు. ఇంజనీరింగ్ చదివిన ప్రతి విద్యార్థి ప్రయోజనకరమైన ఉపాధి పొందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని కడియం శ్రీహరి వెల్లడించారు.
శనివారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షలో అర్హులవుతున్న విద్యార్థుల కంటే సీట్ల సంఖ్య అధికంగా ఉందని వెల్లడించారు. మే నెలలో మరోసారి 288 ఇంజనీరింగ్ కాలేజీల్లో తనిఖీలు నిర్వహిస్తామని కడియం శ్రీహరి పేర్కొన్నారు. అందుకు సంబంధించిన కాలేజీల వివరాలు ఆన్లైన్లో ఉంచామన్నారు... అనుమానాలుంటే 45 రోజుల్లోపు యాజమాన్యాలు నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. యూనివర్శిటీల చట్టానికి సవరణలు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని... ఆ తర్వాతే యూనివర్శిటీలకు వీసీలను నియమిస్తామని కడియం శ్రీహరి చెప్పారు.