ఓవర్‌లోడ్‌కు చెక్!


కరీంనగర్ క్రైం : జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న ఇసుక, గ్రానైట్ లారీలపై పోలీసులు నిఘా పెంచారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఇసుక, గ్రానైట్ క్వారీలున్న ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది రాతంత్రా ఉండి.. అక్రమ రవాణాకు బ్రేకులు వేసేందుకు సిద్ధమయ్యారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఇసుక, గ్రానైట్ క్వారీలున్న పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎస్సైలు రాత్రి ఎనిమిది గంటల నుంచి ఆదివారం ఉదయం వరకూ అక్కడే మకాం వేసేందుకు వెళ్లినట్లు సమాచారం. వీరితోపాటు ఇతర అధికారులను కూడా దాడులు చేసేందుకు వెళ్లాలని సూచించినట్లు తెల్సింది.

 

8 చెక్‌పోస్టులు

జిల్లా నుంచి ఇసుకతోపాటు గ్రానైట్‌రాయిని ఇతర ప్రాంతాలకు ఓవర్‌లోడ్‌తో తరలిస్తుంటారు. వీటితోపాటు పొగాకు ఉత్పత్తులు, ఎన్‌డీపీ మద్యం, బొగ్గు కూడా అక్రమంగా తరలిపోతోంది. వీటిని అడ్డుకునేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా ఎనిమిది చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వీటిని శనివారం సాయంత్రమే ప్రారంభించారు. దీనిలో పోలీసులు, రెవెన్యూ, మైనింగ్, ఆర్టీఏ అధికారులు ఉంటారు. వీరు అయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులో 24 గంటల పాటు వాహనాలను తనిఖీ చేస్తారు. అక్రమంగా తరలుతున్న వాటిపై కేసులు నమోదు చేయనున్నారు.



తిమ్మపూర్ మండలం అల్గునూర్ వద్ద, సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి వద్ద,  ఎల్కతుర్తి మండలం ఎల్కతుర్తి చౌరస్తా వద్ద, కమాన్‌పూర్ మండలం అంబాల క్రాసింగ్ వద్ద, సిరిసిల్ల మండలం జిల్లెల్లలో, ఎల్లారెడ్డిపేట పోలీస్‌స్టేషన్ ఎదుట, ఇబ్రహీంపట్నం మండలం గుండి హన్మండ్ల వద్ద, ధర్మపురి మండలం రాయపట్నం బ్రిడ్జి వద్ద నాలుగు శాఖల అధికారులు 24 గంటలూ వాహనాలను తనిఖీ చేయనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top