శ్మశానాలనూ వదలని గుడుంబా డాన్లు
-
సమాధి తవ్వి ‘సరుకు’దాచిన వైనం -
అధికారుల దాడుల్లో 6020 -
గుడుంబా ప్యాకెట్లు పట్టివేత
చార్మినార్/చాంద్రాయణగుట్ట: గుడుంబా విక్రేతలు శ్మశానాలనూ వదలడంలేదు. సమాధులను తవ్వి అందులో గుడుంబా ప్యాకెట్లు భద్రపరుస్తున్నారు. పాతబస్తీలోని గుడుంబా అడ్డాలపై చార్మినార్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు బుధవారం జరిపిన దాడుల్లో ఈ విషయం బయటపడింది.
చార్మినార్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్గౌడ్ కథనం ప్రకారం....లలితాబాగ్ భయ్యాలాల్నగర్లో గుడుంబా విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు ఎక్సైజ్ బృందాలు వివిధ ప్రాంతాల్లో బుధవారం ఉదయం దాడి చేశాయి. పోలీసుల రాకను గమనించిన నిర్వాహకులు పారిపోయారు. ఘటనా స్థలంలో మొత్తం 6020 గుడుంబా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, 18 గుడుంబా కేసుల్లో నిందితుడిగా ఉండి తప్పించుకు తిరుగుతున్న ధూల్పేటకు చెందిన సజ్జూ సింగ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్గౌడ్ తెలిపారు.
"సమాధిని తవ్వి...
పాతబస్తీలో గుడుంబా డాన్లు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. శ్మశాన వాటికల్లో గుడుంబా ప్యాకెట్లను దాస్తే భద్రంగా ఉంటాయనే ఉద్దేశంతో సమాధులను తవ్వి అందులో దాస్తున్నారు. ఎక్సైజ్ పోలీసులు బుధవారం జరిపిన దాడుల్లో భయ్యాలాల్నగర్, లాల్దర్వాజా శ్మశాన వాటికల్లో గుడుంబా ప్యాకెట్లు లభ్యమయ్యాయి. లాల్దర్వాజాలో అయితే కొందరు అక్రమార్కులు ఏకంగా ఓ సమాధిని తవ్వి అందులో గుడుంబా ప్యాకెట్లను దాచి పెట్టారు. వీటిని అధికారులు స్వాధీనం చేస్తుకున్నారు.