పిల్లల విక్రయ ముఠా పట్టివేత
-
15 రోజుల పాపను అమ్ముతుండగా పట్టుకున్న పోలీసులు -
ఐదుగురి అరెస్టు
బన్సీలాల్పేట్: కాసులకు కక్కుర్తిపడి ...పేద కుటుంబాలకు చెందిన పిల్లలను చట్టవిరుద్ధంగా విక్రయిస్తున్న ఓ ముఠాను గాంధీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి గాంధీనగర్ ఠాణాలో ఇన్స్పెక్టర్ ఎ.సంజీవరావు తెలిపిన వివరాల ప్రకారం... అమీర్పేటకు చెందిన వాకేపల్లి గంగాధర్రెడ్డి(28), ఆర్.శ్రీదేవి(32) కలిసి సంతానం లేని వారికి చిన్నారులను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. సుమారు నాలుగేళ్లుగా వీరు ఈ దందా కొనసాగిస్తున్నారు.
గాంధీనగర్ ఠాణా పరిధిలో శుక్రవారం రాజమండ్రికి చెందిన వెంకటలక్ష్మి 15 రోజుల పసిపాపను మధ్యవర్తి ఆకృతి మాధవితో కలిసి విక్రయిస్తుండగా ఈ ముఠా బండారం బయటపడింది. గంగాధర్రెడ్డి, శ్రీదేవి పేదరికంతో బాధపడుతున్న కుటుంబాల నుంచి పిల్లలను రూ. 20 వేల నుంచి రూ. 50 వేలకు కొనుగోలు చే స్తారు. ఆ పిల్లలను ఇతరులకు రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు విక్రయిస్తున్నారు. ప్రధాన నిందితులిద్దరూ కూడా ఒకరు భార్యకు, మరొకరు భర్తకు విడాకులు ఇచ్చి అమీర్పేట్లో కలిసి ఉంటున్నారు.
నగరంలోని పలు సంతాన సాఫల్య కేంద్రాలకు వీరు బ్రోకర్లుగా వ్యవహరిస్తూ పిల్లలు లేని వారికి చిన్నారులను విక్రయిస్తున్నారు. ముందు వీరు పిల్లలు కావాల్సిన వారితో ఒప్పందం చేసుకుంటారు. తర్వాత పేదరికంతో బాధపడుతున్న వారికి డబ్బు ఎరవేసి వారి నుంచి చిన్నారులను కొనుగోలు చేసి సంతానం లేని వారికి అమ్ముతారు. ఇప్పటి వరకు 10 మంది చిన్నారులను విక్రయించినట్టు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు.
ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని సమాచారం. ప్రధాన నిందితులు గంగాధర్రెడ్డి, శ్రీదేవితో పాటు మధ్యవర్తి మాధవి, వెంకటలక్ష్మి, అమీర్పేట్లోని ఓ సంతాన సాఫల్య కేంద్ర సిబ్బంది సునీత(30)ను అరెస్టు చేసినట్లు సీఐ సంజీవరావు చెప్పారు. వెంకటలక్ష్మి నుంచి స్వాధీనం చేసుకున్న 15 రోజుల పాపను పోలీసులు మహిళా శిశుసంక్షేమశాఖ అధికారులకు అప్పగించారు.
సంబంధిత వార్తలు