కలిసి పనిచేస్తే లాభాల బాట

కలిసి పనిచేస్తే లాభాల బాట - Sakshi


►  జిల్లాలో ప్రతి పల్లెకు బస్సు సౌకర్యం కల్పించాలి

►  పల్లె వెలుగు’తోనే రూ.500కోట్లు నష్టం

►  ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చేస్థాయికి ఆర్టీసీ ఎదగాలి

►  ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ


             

 

 

మహబూబ్‌నగర్ క్రైం : జిలాల్లో ప్రతి పల్లెకు బస్సు సౌకర్యం కల్పించి.. కార్మికులు, అధికారులు కలిసి పనిచేస్తేనే సంస్థ లాభాల బాట పడుతుందని ఆర్టీసీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. మహబూబ్‌నగర్ బస్సు డిపోలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఓఆర్‌తో పాటు బస్సుల సంఖ్య పెంచి సమయానికి ప్రయాణికుడికి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఉద్యోగుల సమస్యలు తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం వారికి 44శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిందని, ఇది దృష్టిలో పెట్టుకుని కష్టపడాలన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ గురించి సీఎం దగ్గర చర్చించి ప్రత్యేక రాయితీలు తీసుకురావడంతో పాటు సంస్థలో ఉండే వారిని ప్రోత్సహిస్తామన్నారు.  రాష్ట్రంలో ఆర్టీసీకి ఒక్క పల్లెవెలుగుతోరూ.500కోట్ల నష్టం వాటిల్లుతుందన్నారు. సంస్థ గతేడాది రూ.700కోట్ల అప్పుల్లో ఉంటే, ఈ ఏడాది రూ.220కోట్ల అప్పు ఆర్టీసీ సంస్థ తలపై వేలాడుతోందన్నారు.





నష్టాలపై చర్చించాలి

పాలమూరు జిల్లాలో ఆర్టీసీ నష్టాల్లో నడుస్తుందనే అపకీర్తిని అతి తక్కువ కాలంలో తుడిచివేయాలని సోమారపు అన్నారు. ఏ కారణంతో నష్టం వస్తుందనే విషయం కార్మికుడి నుంచి ఓ ఉన్నత అధికారి వరకు చర్చించుకోవాలన్నారు. ఆర్టీసీ బస్సులు రోడ్డుపై బ్రేక్‌డౌన్ కాకుండా  మెకానిక్‌లు చూసుకోవాలన్నారు. ఎప్పుడు కూడా ఆర్టీసీ సంస్థ ప్రభుత్వంపై ఆదారపడకుండా ఆర్టీసీనే ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు.





 భూమి కేటాయిస్తే..  అన్ని హంగులతో నిర్మాణం

రాష్ట్ర ప్రభుత్వం పది ఎకరాల భూమి కేటాయిస్తే ఇక్కడి డిపోను ఇతర ప్రాం తానికి మార్చి ఈ బస్టాండ్‌ను అత్యంత హంగులతో పలు వాణిజ్య సముదాయలతో నిర్మాణం చేయిస్తామని ఆర్టీసీ చైర్మన్ అన్నారు. త్వరలోనే మన్యంకొండకు, పిల్లల మర్రికి మినీ బస్సులు ప్రారంభిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఆర్టీసీ జేఎండీ రమణారావు మాట్లాడారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top