సీఎం తమ గోడు వినాలని బిల్ట్ కార్మికుల ఆందోళన


మంగపేట(కమలాపురం) : మండలం మీదుగా భారీ పోలీస్ బందోబస్త్ నడుమ తన కాన్వాయ్‌తో వరంగల్‌కు తరలివెళ్ళి ముఖ్యమంత్రి పర్యటన కమలాపురం బిల్ట్ కార్మికులను నిరాశ పరిచినట్లయింది. మండలానికి పొరుగునే ఉన్న ఖమ్మం జిల్లా పినపాక మండలం ఉప్పాక గ్రామపంచాయతీ పరిధిలోని సీతారాంపురంలో భద్రాద్రి పవర్‌ప్లాంట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శనివారం సాయంత్రం మండలం మీదుగా వరంగల్‌కు వెళ్లారు.



ఈ సందర్భంగా 47 రోజులుగా బిల్ట్ కర్మాగారం ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న కార్మికులు, కార్మిక కుటుంబాల మహిళలు వందలాది మంది ముఖ్యమంత్రిని కలిసి బిల్ట్ సమస్యతో పాటు బిల్ట్ ఫ్యాక్టరీని మూసివేయడం వలన ఎదురయ్యే సమస్యను నేరుగా విన్న వించుకునేందుకు తరలివచ్చి బిల్టు మెయిన్ గేటు వద్ద మండు టెండను లెక్కచేయకుండా రెండున్నర గంటల పాటు వేచి చూశారు.



ఈ సందర్బంగా టీఆర్‌ఎస్ నాయకులు, కార్మికులు రోడ్డుకు అడ్డంగా వచ్చి ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు ప్రయత్నించారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఏటూరునాగారం సీఐ కిశోర్‌కుమార్, ఎస్సై వినయ్‌కుమార్, మంగపేట ఎస్సై ముష్కం శ్రీనివాస్ సీఆర్‌పీఎఫ్ బలగాలతో ఫ్యాక్టరీ గేటు ముందు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఏటూరునాగారం బూర్గంపహాడ్ ప్రధాన రహదారిపైకి ఎవరినీ రానీయకుండా అడ్డుకున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top