కూతుర్ని కామాంధుడికి అప్పగించిన తల్లి!
డబ్బుకోసం దారుణం..
బాలికపై హెడ్ కానిస్టేబుల్ పలుమార్లు అత్యాచారం
కామాంధుడితోపాటు, తల్లిపై కేసు.. అరెస్టు, రిమాండ్
సంగారెడ్డి చైల్డ్ హెల్ప్లైన్కు బాలిక తరలింపు
శివ్వంపేట: కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లే.. కూతుర్ని ఏమార్చి, ఆమె జీవితాన్ని నాశనం చేసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా శివ్వంపేట ఎస్ఐ రాజేష్నాయక్ కథనం మేరకు.. వరంగల్ జిల్లాకు చెందిన పద్మ భర్తను వదిలేసి శివ్వంపేట బీక్యా తండాకు చెందిన టీక్యాను వివాహం చేసుకుంది. అంతకుముందే ఈమెకు 14 ఏళ్ల కుమార్తె ఉంది. ఆ బాలిక శివ్వంపేటలోని కస్తుర్బా గిరిజన బాలికల హాస్టల్లో 9వ తరగతి చదువుతోంది. ఇదిలా ఉండగా.. రంగారెడ్డి జిల్లా కూకట్పల్లి పోలీస్స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్న హరినాయక్ అలియాస్ హరిసింగ్ (46) జిన్నారం మండలం బహదూర్పల్లి వద్ద ఓ పరిశ్రమను నడుపుతుండగా.. పద్మ అందులో పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు, హెడ్కానిస్టేబుల్ హరి సింగ్కు మధ్య పరిచయం బాగా పెరిగింది. పద్మ కుమార్తె సంక్రాంతి సెలవుల్లో తల్లి వద్దకు వెళ్లగా.. ఆ బాలికపై హరినాయక్ కన్ను పడింది. అమ్మాయిని ఎలాగైనా లోబర్చుకోవాలనే ఉద్దేశంతో తల్లికి డబ్బు ఎర చూపాడు. దీంతో ఆమె తన కుమార్తెను హరినాయక్కు అప్పగించింది. ఇలా ప్రతినెలా పద్మ కస్తూర్బా పాఠశాలకు వచ్చి ఆరోగ్యం బాగా లేదని, ఇంట్లో శుభకార్యం ఉందని సాకులు చెబుతూ, కుమార్తెను బలవంతంగా వెంట తీసుకెళ్లి హరినాయక్కు అప్పజెప్పేది. దీంతో అతడు పలుమార్లు ఆ బాలికపై అత్యాచారం జరిపాడు.
దీంతో ఆ విద్యార్థిని ఈనెల 24న చైల్డ్ హెల్ప్లైన్ 1098 నంబరుకు ఫోన్చేసి తనపై జరుగుతున్న అఘాయిత్యం గురించి వివరించింది. దీంతో వారు రంగంలోకిదిగి ఈ నెల 25న పాఠశాలకు వచ్చి విద్యార్థిని నుంచి వివరాలు సేకరించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి రెండేళ్లుగా సిక్లీవులో ఉన్న హెడ్కానిస్టేబుల్ హరినాయక్, బాలిక తల్లి పద్మపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకొని, కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు తరలించారు. ఆ బాలికను హరినాయక్ వద్దకు తీసుకెళ్లేందుకు మధ్యవర్తిగా ఉన్న మరోవ్యక్తి నెహ్రూ కోసం గాలింపు చేపట్టామని, ప్రస్తుతం ఆ బాలిక సంగారెడ్డి చైల్డ్హెల్ప్లైన్ సిబ్బంది వద్ద ఉందని ఎస్ఐ చెప్పారు.