మరణిస్తూ మరో నలుగురికి ప్రాణదానం
మన్సూరాబాద్: తాను మరణిస్తూ తన అవయవాలను దానం చేసి మరో నలుగురి జీవితాల్లో వెలుగు నింపాడో యువకుడు. జీవన్దాన్ ప్రతినిధి అనూరాధ తెలిపిన వివరాల ప్రకారం.... ఖమ్మం జిల్లా మణుగూరుకు చెందిన డాక్టర్ జయశ్రీ, భర్త ఆదిత్య, కుమారుడు వెంకటసాయి మనోహర్ (22), కుమార్తె కావ్యలు ఈనెల 24న నగరంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో గాయపడ్డ కుటుంబ సభ్యులను చికిత్స నిమిత్తం ఎల్బీనగర్లోని కామినేని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రమాదంలో వెంకటసాయి మనోహర్ బ్రెయిన్డెడ్ అయినట్లు 25న వైద్యులు గుర్తించారు.
వైద్యురాలైన తల్లి జయశ్రీ కొడుకు వెంకటసాయి మనోహర్ అవయవాలను దానం చేయడానికి అంగీకరించారు. జీవన్దాన్ ప్రతినిధులు శనివారం తెల్లవారుజామున వెంకటసాయి మనోహర్ గుండె, లివర్, కిడ్నీలు, రెండు కళ్ల కార్నియాలను తీసుకున్నారు. గుండెను ప్రత్యేక విమానంలో చెన్నైకి తరలించారు. ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి నుంచి ఎయిర్పోర్టు వరకు అవయవాలను తరలించేందుకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.