బోవెరా అమర్‌రేహ

బోవెరా అమర్‌రేహ


కరీంనగర్ :

 ప్రముఖ స్వాతంత్య సమరయోధుడు బోయినపల్లి వెంకటరామారావు(బోవెరా) అంత్యక్రియలు మంగళవారం ఘనంగా జరిగాయి. కరీంనగర్ శివారులోని మానేరు నదీతీరంలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అంత్యక్రియలకు హాజరై బోవేరాకు నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 12.10 గంటలకు కలెక్టరేట్‌లోని హెలిప్యాడ్‌కు వచ్చారు.



ఆయన వెంట మంత్రులు ఈటెల రాజేందర్, టి.హరీశ్‌రావు, పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్ వచ్చారు. హెలిప్యాడ్ వద్ద కేసీఆర్‌కు ఎమ్మెల్యేలు, అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో భగత్‌నగర్, రామచంద్రాపూర్‌కాలనీ, సిరిసిల్ల బైపాస్ మీదుగా మానేరు వద్ద గల స్వర్గధామ్ శ్మశాన వాటికకు చేరుకున్నారు. బోవెరా పార్థీవదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పిం చారు. పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి నివాళులర్పించారు.



అనంతరం బోవెరా కుటుంబసభ్యులను సీఎం పరామర్శించి, ఓదార్చారు. అక్కడినుంచి హెలిప్యాడ్‌కు వెళ్లి అనంతరం హైదరాబాద్ వెళ్లిపోయారు. బోవెరా అంత్యక్రియల్లో ఎంపీ బి.వినోద్‌కుమార్, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సోమారపు సత్యనారాయణ, దాసరి మనోహర్‌రెడ్డి, పుట్ట మధు, వొడితెల సతీశ్, టి.జీవన్‌రెడ్డి, బొడిగె శోభ, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, నగర మేయర్ రవీందర్‌సింగ్, కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య, జేసీ సర్ఫరాజ్ అహ్మద్, ఆర్డీవో చంద్రశేఖర్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, మాజీ మంత్రి జి.రాజేశంగౌడ్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు బొమ్మ వెంకన్న, కఠారి దేవేందర్‌రావు, వుచ్చిడి మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top