బ్లాక్మెయిలింగ్ ముఠా అరెస్ట్
‘సాక్షి’ కథనాలతో కదిలిన డొంక
* ఐదుగురి నుంచి రూ.12 లక్షల వసూలు
* ఆరుగురు అరెస్టు.. పరారీలో ఇద్దరు
వరంగల్ క్రైం: మీడియా పేరుతో బ్లాక్మెయిల్ చేస్తున్న ముఠాను వరంగల్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. హన్మకొండలోని హెడ్క్వార్టర్స్లో సోమవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు అరెస్టు వివరాలను వెల్లడించారు. కేసరాజు దేవేందర్, జాటోతు కృష్ణ, అదులాపురం మహేశ్, పిడమర్తి మనోహర్, మార్క శ్రీకాంత్, వంగూరి నాగలక్ష్మి అలియాస్ జస్సికలు ఎస్-9 చానల్లో పనిచేసేవారు.
4 నెలల క్రితం ఈ చానల్ను మూసివేయడం తో డబ్బు సంపాదనకు ఈ మార్గాన్ని ఎంచుకున్నా రు. నగరంలోని ప్రముఖులకు నాగలక్ష్మి, కవిత అలి యాస్ దివ్య ద్వారా ఫోన్లు చేయించేవారు. ‘ఉద్యోగం కావాలని.. మిమ్మల్ని కలవాలంటూ’ మాటలతో రెచ్చగొట్టేవారు. సదరు వ్యక్తులు రమ్మనగానే అమ్మాయిల వెనుక వీరంతా ఆ ఇంట్లోకి వీడియో కెమెరాలతో ప్రవేశించేవారు. ఇక్కడ వ్యభిచారం జరుగుతోందంటూ సదరువ్యక్తిని బెదిరించి బ్లాక్మెయిల్ చేసేవారు.
ఈవిధంగా దాదాపు రూ.12 లక్షలు వరకు వసూలు చేశారు. ఈ విషయంలో సుబేదారి పోలీస్స్టేషన్లో ఒక కేసు నమోదైంది. కచ్చితమైన సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ నరేందర్, సిబ్బంది కేయూసీ ఆడిటోరియం వద్ద సోమవారం ఉదయం ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి ఒక కరోలా కారు, రెండు మోటారు సైకిళ్లు, ఆటో, వీడియో కెమెరా, మొబైల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దేవేందర్, మనోహర్ పరారీలో ఉన్నారు.