బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం
-
గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా అమిత్ షా టూర్ -
రెండు రోజుల పర్యటనలో దిశానిర్దేశం
సాక్షి, సిటీబ్యూరో/హుడాకాంప్లెక్స్/ఆర్కేపురం: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రెండు రోజుల పర్యటన ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నిం పింది. త్వర లో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపుకోసం పార్టీకి దిశానిర్దేశం చేశారు. ఈ రెండు రోజులపాటు పలు కార్యక్రమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నాయకులతో విస్తృతంగా చర్చిం చారు. పార్టీ కార్యకర్తలు, నాయకులతో స్వయంగా మాట్లాడేందుకు ప్రయత్నించారు. వారిని ఎన్నికల దిశగా కార్మోన్ముఖులను చేస్తూ మార్గ నిర్దేశం చేశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసేందుకు, కొత్త వారిని ఆకర్షించేందుకు అనుసరిం చాల్సిన విధానంపై చర్చించారు. నగరంలోని పలు చోట్ల ఏర్పాటు చేసిన సభలు,సమావేశాల్లోనూ ఇదేవిధమైన దిశానిర్దేశాన్ని సూచిస్తూ చేసిన ప్రసంగాలు పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం హామీలతో ప్రజలను మభ్య పెడుతుం దనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు బీజేపీ ఈ రెండు రోజుల్లో గట్టిగా ప్రయత్నించింది.
వాగ్ధానాలతో మభ్యపెడుతున్న టీఆర్ఎస్
టీఆర్ఎస్ ప్రభుత్వం వాగ్ధానాలతోనే ప్రజలను మభ్యపెడుతోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ ఆరోపించారు. శుక్రవారం ఎల్బీనగర్ సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన గ్రామ, బూత్ స్థాయి అధ్యక్షుల సమావేశానికి జాతీయ అధ్యక్షులు అమిత్ షా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు దిగిన రైతులు, ప్రజలపై సర్కార్ లాఠీచార్జీలకు దిగుతోందని విమర్శించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమన్వయంతో రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
ఎంఐఎం కనుసన్నల్లో టీఆర్ ఎస్ : కిషన్రెడ్డి
టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎం కనుసన్నలో నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్రెడ్డి విమర్శించారు. ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, ఉద్యోగులు, సంఘాలను వదిలేసి కేసీఆర్ ఎంఐఎంకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. బీజేపీ శాసనసభాపక్ష నేత కె.లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ ఎంతో కృషి చేసిందన్నారు.
జాతీయ నాయకులు విద్యాసాగర్రావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, నాగం జనార్దన్రెడ్డిలు మాట్లాడుతూ, దక్షిణాదిలో కర్నాటక తరువాత తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి కార్యకర్త గ్రామ స్థాయి నుంచి కృషి చేయాలని సూచించారు. సమావేశంలో సీనియర్ నాయకులు చింతా సాంబమూర్తి, ఎమ్మెల్యేలు రాజాసింగ్ లోథ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాంచంద్రారెడ్డ్డి, మాజీ మంత్రి పుష్పలీల, ప్రేమేందర్రెడ్డి, సత్యనారాయణ, ఆచారి, మంత్రి శ్రీనివాస్, రాంచందర్రావు, పేరాల చంద్రశేఖర్రావు, మందాడి సత్యనారాయణ, ప్రదీప్కుమార్, పద్మ, వెంకటేశ్వరరావు, మనోహర్రెడ్డి, రంగారెడ్డి జిల్లా నేత చంద్రయ్య పాల్గొన్నారు.
అమిత్ షాకు వినతుల వెల్లువ
జూబ్లీహిల్స్: పర్యాటక భవన్లోని హరితాహోటల్లో బస చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాను శుక్రవారం పలు సంఘాలు, సంస్థల ప్రతినిధులు కలిశారు. తమ డిమాండ్లు నెరవేరేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరుతూ వినతి పత్రాలు సమర్పించారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నేతృత్యంలో పలువురు బీసీ సంఘం నేతలు కలిశారు. బీసీ సబ్ప్లాన్ తక్షణమే అమలు అయ్యేలా, బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసేలా కేంద్రాన్ని ఒప్పించాలని కోరారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ట మాదిగ కూడా కలిసి ఉషామెహ్రా కమిటీ నివేదికను తక్షణమే అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. జయభారత్రెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమ రాజధాని సాధన సమితి సభ్యులు అమిత్షాతో భేటీ అయ్యారు. రాయలసీమ పరిధిలోనే కొత్త రాజధాని ఏర్పాటు చేయించాలన్నారు.
ఆర్ఎస్ఎస్, హిందూవాహిని తదితర సంస్థలతో సహా పలువురు నుంచి క్రిస్టియన్లపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, వారి ఆస్తులు పరిరక్షించాలని కోరుతూ ఆల్ ఇండియా ఇండిపెండెంట్ క్రిస్టియన్ యూనియన్ నేత సెబాస్టియన్ ఆధ్వర్యంలో పలువురు సభ్యులు అమిత్షాకు వినతిపత్రం సమర్పించారు. వీరితోపాటు ఇస్కాన్, రైతు, చేనేత పలు సంఘాలు, పలు సంస్థల ప్రతినిధులు అమిత్షాను కలిసిన వారిలో ఉన్నారు.
సంబంధిత వార్తలు