ముస్లిం రిజర్వేషన్లను అమలు కానివ్వం
కరీంనగర్ : భూమి, ఆకాశం ఏకమైనా ముస్లిం రిజర్వేషన్లను అమలు కానివ్వమని బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ కులం ఆధారంగా బీసీ రిజర్వేషన్లను తీసుకొస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ వితండవాదం చేస్తున్నారని మండిపడ్డారు. చారిత్రాత్మకమైన రోజు కాదని, కేసీఆర్ చారిత్రాత్మక తప్పదం చేస్తున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలను సంఘటితపరిచి మతపరమైన రిజర్వేషన్లను అడ్డుకుంటామన్నారు.
మంత్రివర్గ వివరాలు వెల్లడిస్తామని, పార్టీ వివరాలు చెప్పడం ఎంతవరకూ సమంజసమని ఆయన ప్రశ్నించారు. బీసీల రిజర్వేషన్ల కోసం అవసరం అయితే ఢిల్లీలో ధర్నా చేస్తామన్నారు. కేంద్రాన్ని కించపరిచేలా కేసీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. మరోవైపు కరీంనగర్జిల్లా పర్యటనలో ఉన్న కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి పురుషోత్తం రూపాల్ కూడా ఇదే అంశంపై టీ సర్కార్ నిర్ణయాన్ని ఖండించారు. మతపరమైన రిజర్వేషన్లను తెలంగాణ ప్రభుత్వం ఇస్తే అడ్డుకుని తీరతామన్నారు.
కాగా రాష్ట్రంలో ముస్లింలు, ఎస్టీలకు రిజర్వేషన్లను పెంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించిన విషయం తెలిసిందే. తెలంగాణ రిజర్వేషన్ చట్టం పేరుతో బిల్లును తీసుకొస్తామని.. 16న అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి బిల్లు ప్రవేశపెడతామని ఆయన నిన్న తెలిపారు.