'టీఆర్ఎస్ ప్రభుత్వానికి అదే గతి పడుతుంది'
హైదరాబాద్: రాజ్యాంగ విరుద్ధం అయిన మత పరమైన రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా తమ పార్టీ శ్రేణులు చేపడుతున్న ఆందోళనలను ప్రభుత్వం అణచివేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. సోమవారం భువనగిరిలో ధర్నా చేపట్టిన బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడిని అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెట్టారని తెలిపారు. హైదరాబాద్ లోని ధర్నాచౌక్ ను తీసివేశారని.. మరి ఎక్కడ నిరసన తెలపాలని ఆయన ప్రశ్నించారు.
వెంటనే యువమోర్ఛా కార్యకర్తలను విడుదల చేయకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. గతంలో కాంగ్రెస్ కూడా మతపరమైన రిజర్వేషన్ కల్పిస్తే ఏ గతి పట్టిందో అదే గతి టీఆర్ఎస్ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. ఈనెల 24వ తేదీన తాము యువమోర్ఛా ఆధ్వర్యంలో చలో అసెంబ్లీకి పిలుపునిచ్చామని, ఆ రోజు తమ పార్టీ ఎమ్మెల్యేలు సభలోనే ఉండి టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను ఎత్తిచూపుతామని ఎమ్మెల్యే లక్ష్మణ్ పేర్కొన్నారు.