2019లో అధికారమే మా లక్ష్యం
హైదరాబాద్ : 2019 ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ మీట్ ది ప్రెస్లో మాట్లాడుతూ టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని, సీఎం అభ్యర్థి ఎవరనేది ఎన్నితక తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలో మూడు రోజులపాటు పర్యటిస్తారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, దీంతో ప్రభుత్వంపై అన్నివర్గాల్లో వ్యతిరేకత ఏర్పడిందన్నారు. అందుకే ఉస్మానియా శతాబ్ది వేడుకల సందర్భంగా ఓయూలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడలేకపోయారన్నారు.
కాగా అమిత్ షా ఈ నెల 22న శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా నల్లగొండ జిల్లాకు పయనమవుతారు. అక్కడ చండూరు మండలం తేరట్పల్లికి చేరుకుంటారు. బీజేపీ రాష్ట్రకార్యదర్శిగా పనిచేసిన మైసయ్యగౌడ్ను గతంలో నక్సల్స్ హతమార్చిన ప్రదేశంలో నివాళులర్పిస్తారు. అదే గ్రామంలో బూత్స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తారు. మధ్యాహ్నం దళితబస్తీలో భోజనం చేస్తారు.
23న ఉదయమే నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఎలుగుపల్లిలో పోలింగ్బూత్ సమావేశాన్ని నిర్వహిస్తారు. పక్కనే ఉన్న దళిత బస్తీకి దీన్దయాళ్ నగర్గా నామకరణం చేస్తారు.
24న ఉదయమే చిట్యాల మండలం గుం డ్రాంపల్లిని సందర్శించి రజాకారుల దాడుల్లో మరణించిన వారికి నివాళులర్పిస్తారు. ఈ గ్రామంలో రజాకార్ సైన్యం 150 మంది గ్రామస్తులను చంపి బావిలో వేసిన ఘటన.. మరో జలియన్వాలా బాగ్ ఘటన మాదిరిగా చరిత్రపుటల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. సాయంత్రం హైదరాబాద్కు చేరుకుని కార్యకర్తల సదస్సులో పాల్గొంటారు.