ఖాతాదారులకు మెరుగైన సేవలు
-
ఆంధ్రా బ్యాంక్ సీఎండీ సీవీఆర్ రాజేంద్రన్
హన్మకొండ సిటీ : ఖాతాదారులకు మెరుగైన సేవలందిస్తున్నామని ఆంధ్రా బ్యాంక్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ) సీవీఆర్ రాజేంద్రన్ అన్నారు. నక్కలగుట్టలోని ప్రధాన రహదారిలో ఉన్న ఆంధ్రా బ్యాంక్ బ్రాంచ్ శాఖను వాటర్ ట్యాంక్ ఎదురుగా ఉన్న వీదిలోకి శుక్రవారం మార్చారు. నూతన భవనంలో బ్యాంక్ శాఖను సీవీఆర్ రాజేంద్రన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాజేంద్రన్ మాట్లాడారు. ఖాతాదారులు బ్యాంకుకు వచ్చి తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా ఉండేందుకు సత్వర సేవలు అందిస్తున్నామన్నారు. ఈ మేరకు బ్యాంక్ శాఖలను మార్పు చేశామన్నారు. ‘నవశక్తి’ అనే పేరుతో సత్వర సేవలు అందించే కార్యక్రమాన్ని ఆంధ్రా బ్యాంకు తీసుకుందన్నారు. ఈ-బ్యాంకింగ్ ద్వారా క్యాష్ డిపాజిట్ చేయడం, క్యాష్ తీసుకోవడం, పాస్బుక్ అప్డేట్ చేసుకొనే సౌకర్యాన్ని కల్పించామన్నారు. నక్కలగుట్టలోని బ్యాంక్ శాఖలో 24 గంటల పాటు ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.
ఈ-బ్యాంకింగ్ సేవల కోసం క్యాష్ డిపాజిట్ మిషన్, ఏటీఎం మిషన్ను ఏర్పాటు చేశామన్నారు. నక్కలగుట్ట బ్యాంక్ రూ.140 కోట్ల డిపాజిట్లు కలిగి ఉందన్నారు. రూ.60 కోట్ల అప్పులు ఇచ్చిందన్నారు. 28 వేల మంది ఖాతాదారులను కలిగి ఉందని వివరించారు. అన్ని రకాల రుణాలు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆంధ్రా బ్యాంక్ జోనల్ మేనేజర్ సి.ధనుంజయ, ఏజీఎం కె.వి.నాంచారయ్య, నక్కలగుట్ట శాఖ సీనియర్ చీఫ్ మేనేజర్ రఘురామయ్య, సిబ్బంది పాల్గొన్నారు.