నీటి వాటాపై వాదనల్లో రాష్ట్రం విఫలం
► అందుకే రాష్ట్రానికి తక్కువ కేటాయింపులు
► కేంద్ర మంత్రి దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో వాటాలపై బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపించడంలో విఫలమైందని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. డిపెండబులిటీని 75 శాతం నుంచి 65 శాతానికి తగ్గించడంతో కొంత నష్టపోగా, సరైన వాదనలు వినిపించక పోవడంతో నష్టం జరిగిందని, ఫలితంగా రాష్ట్రానికి తక్కువ నీటి కేటాయింపులు జరిగాయని అన్నారు. చివరగా సుప్రీంకోర్టులో మరో అవకాశం ఉందని, ఈసారైనా సరైన నిపుణులను సంప్రదించి సమర్థవంతంగా వాదనలు వినిపించాలని ప్రభుత్వానికి సూచించారు. ఆదివారం దిల్కుషా అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజు బకాయిలు కోట్లలో పేరుకుపోయాయని, దీంతో విద్యార్థులపై ఒత్తిడి పెరగడంతో మధ్యలోనే చదువులు ఆపేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఫెడరేషన్లు, కార్పొరేషన్లకు నిధుల విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని, దీంతో ఆయా సంస్థలు దివాలా తీస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి సంస్థకు కనిష్టంగా రూ.150 కోట్ల బడ్డెట్ పెంచాలని, కులవృత్తులు అంతరించిపోతున్నాయని, వీటిపై ఆధారపడ్డ కుటుంబాలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి సాంకేతిక నైపుణ్యాన్ని జోడించాలని, దీంతో ఉత్పత్తులు పెరగడంతో పాటు ఆయా కుటుంబాల ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటు చేసిన బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములుతో పాటు సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్, ఆంజనేయగౌడ్, గౌరిశంకర్లను ఆయన సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.