అమిత్ షాకు అసదుద్దీన్ సవాల్
హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సవాల్ విసిరారు. తనపై పోటీ చేయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. హైదరాబాద్ ప్రజలు ఎవరిని గెలిపిస్తారో చూద్దామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానంతో పాటు అంబర్పేట అసెంబ్లీ సీటును గెల్చుకుంటామని ఆయన దీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ తుదిచిపెట్టుకుపోవడం ఖాయమని అసదుద్దీన్ అన్నారు.
గుడిమల్కాపూర్ క్రిస్టల్ గార్డెన్లో బుధవారం జరిగిన హైదరాబాద్ పార్లమెంట్ బూత్స్థాయి సమవేశానికి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 11 కోట్ల సభ్యత్వంతో ప్రపంచంలోనే బీజేపీ పెద్ద పార్టీగా అవతరించిందని అమిత్ షా చెప్పారు. బీజేపీ బలపడుతుండటం కొందరు వ్యతిరేకులకు బీపీ పెరుగుతోందని వ్యాఖ్యానించారు. నల్లగొండ జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించిన అమిత్ షా గురువారం విజయవాడ చేరుకున్నారు.