యాదాద్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
- విష్వక్సేన ఆరాధన, స్వస్తివాచనంతో శ్రీకారం
- 11 రోజుల పాటు వైభవంగా జరగనున్న ఉత్సవాలు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనారసింహస్వామి దేవస్థానంలో సోమవారం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు జరగనున్న ఈ బ్రహ్మోత్సవాలను విష్వక్సేన ఆరాధన, స్వస్తివాచనంతో శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఆలయంలోని ఉత్సవమూర్తులకు అర్చకులు అభిషేకం, అర్చనలు గావించారు. ప్రత్యేక పీఠంపై అధిష్టింపజేసి స్వామి, అమ్మవార్లకు ఎదురుగా ఉత్సవాలకు ఆద్యుడైన విష్వక్సేన ఆరాధన నిర్వహించారు. అనంతరం స్వస్తి వాచనం చేసి ఆలయ తిరువీధులు , గర్భాలయం, సంగీత భవనం తదితర ప్రాంతాలను శుద్ధ గంగాజలంతో సంప్రోక్షణ చేశారు. అంతకుముందు ప్రధానాలయంలోని స్వయంభూ మూర్తుల అనుమతిని తీసుకుని స్వామి, అమ్మవార్లకు కంకణధారణ చేశారు. అర్చకులు , వేద పండితులు, రుత్విక్కులకు దీక్షావస్త్రాలను సమ¯ర్పించారు.
ఘనంగా అంకురార్పణ, మృత్సంగ్రహణం
బ్రహ్మోత్సవాలకు కోసం సాయంకాలం మట్టి పాలికలలో నవధాన్యాలను నింపి అంకురార్పణ చేశారు. స్వామి, అమ్మవార్ల కళ్యాణ వేదికకు అవసరమయ్యే మట్టిని సేకరించే కార్యక్రమమైన మృత్సంగ్రహణంను ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం నుంచి ఆరు రోజుల పాటు ఉచితవైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నారు. 4 నుంచి 8వ తేదీ వరకు ఐదు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ బి.నరసింహమూరి, ఈఓ గీతారెడ్డి, ఆలయ ప్రధానార్చకులు నల్లందీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నరసింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, చింతపట్ల రంగచార్యులు, సముద్రాల శ్రీనివాసాచార్యులు ఆలయ అధికారులు దోర్భల భాస్కరశర్మ, చంద్రశేఖర్, రామ్మెహన్రావు, మేడి శివకుమార్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.