బాబు నోరు తెరిస్తే... అన్నీ అబద్ధాలే: జూపల్లి
సాక్షి, హైదరాబాద్: తన హయాంలోనే తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధి చెందాయని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించడాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆక్షేపించారు. బాబు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే వస్తాయని ఎద్దేవాచేశారు. అభివృద్ధిపై చర్చించడానికి తాము ఎప్పుడైనా సిద్ధమని, చర్చకు చంద్రబాబు వస్తారా అని ఆయన సవాలు చేశారు. గురువారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో జూపల్లి విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణలో ఉనికి కోసం తాపత్రయపడుతున్న టీడీపీ ఆశలు నెరవేరవని వ్యాఖ్యానించారు.
తెలంగాణ అమర వీరుల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు, టీడీపీ నేతలకు లేదని దుయ్యబట్టారు. ఉస్మానియా వర్సిటీ భూములపై టీడీపీ మాట్లాడటమేంటని ప్రశ్నించారు. హైదరాబాద్లో ఉంటే విదేశాల్లో ఉండి పాలన చేస్తున్నట్లు ఉందన్న బాబు ఎందుకు ఇక్కడే ఉంటున్నారని నిలదీశారు.
బినామీలకు సెంట్రల్ వర్సిటీ భూములు: గట్టు
హైదరాబాద్లోని సెంట్రల్ వర్సిటీకి చెందిన 450 ఎకరాల భూములను చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టారని టీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పది మందితో మాట్లాడించి అబద్ధాన్ని నిజం చేయాలని బాబు ప్రయత్నిస్తున్నారని, తన యుని కోసం డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.