హైదరాబాద్‌పై ఆల్ కాయిదా నీడలు

హైదరాబాద్‌పై ఆల్ కాయిదా నీడలు - Sakshi


అఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రశిక్షణకు సిద్ధమైన ఇద్దరు యువకులు

సికింద్రాబాద్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు

నగరానికి చెందిన మౌతసిమ్ బిల్హా సూత్ర ధారి


 

సాక్షి, హైదరాబాద్: ఆల్‌కాయిదా ఉగ్రవాదం హైదరాబాద్‌లో చాపకింద నీరులా ప్రవహిస్తుంది. నగరానికి చెందిన వ్యక్తులే ఉగ్రవాద శిక్షణ కోసం కొంతమంది యువకులను ఇతర దేశాలకు పంపిస్తున్నారు.‘ఉగ్ర’శిక్షణకు అఫ్ఘనిస్థాన్ వెళ్తున్న మహారాష్ట్రకు చెందిన ఇద్దరు యువకులను బుధవారం సికింద్రాబాద్‌లో పోలీసులు అదపులోకి తీసుకోవడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఉత్తర మండల డీసీపీ జయలక్ష్మీ  మీడియాకు వివరించారు. నగరానికి చెందిన మౌతసిమ్ బిల్హా  ఇస్లామిక్ రాజ్యం స్థాపించేందుకు జిహాద్ చేయాలంటూ చురుకైన యువకులను అఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాద శిక్షణ కోసం పంపిస్తున్నాడు.

 

 ఈ క్రమంలో ఇతడికి మహారాష్ట్ర ఒమర్‌ఖేడ్ జిల్లా షాకాలనీకి చెందిన షా ముదసిర్ అలియాస్ తల్హా (25), హంగోలి జిల్లా అఖడబాలాపూర్‌కు చెందిన షోయబ్ అహ్మద్‌ఖాన్ (24)లు పరిచయం అయ్యారు. షా ముదిసర్ మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీలో బి.ఎ. చదివాడు. సిమీ(స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా) అనుబంధ షాహిన్ ఫోర్స్‌లో ఇతడు కీలక సభ్యుడు. 2001లో సిమీపై నిషేధం విధించడంతో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మైనారిటీ స్టూడెంట్ (ఏఐఎంఎస్)లో సభ్యుడిగా చేరాడు. ఆ తరువాత సోదరుడి ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేశాడు. ఫేస్‌బుక్ వేదికగా వీరిద్దరిని అఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రశిక్షణకు వెళ్లేందుకు మౌతసిమ్ బిల్హా ఒప్పించాడు. ఈ మేరకు ఒకసారి హైదరాబాద్‌కు వచ్చి తనను కలవాలని వారిని కోరాడు. దీంతో వారిద్దరు గత నెల 3న బిల్హా ఇంటికి వద్దకు వచ్చి కలిశారు. ఈ సందర్భంగా ముగ్గురు రెండు గంటల పాటు తమ ఉగ్రవాద కార్యకలాపాలపై చర్చించుకున్నారు.అప్పటికే ఫేస్‌బుక్‌లో బాంబులు ఎలా తయారు చేయాలో కూడా బిల్హా  వీరికి సూచనలు ఇచ్చాడు.

 

 అఫ్ఘనిస్థాన్ వెళ్లేందుకు సిద్ధమైతే అక్టోబర్ 10న మళ్లీ తన వద్దకు రావాలని వారికి సూచించాడు. దీంతో షా ముదసిర్, షోయబ్‌లు మహారాష్ట్ర నుంచి తిరిగి బుధవారం రైలులో సికింద్రాబాద్ చేరుకున్నారు. అక్కడ  అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న  వీరిని గోపాలపురం పోలీసులు అదపులోకి తీసుకొని ప్రశ్నించడంతో ఆల్‌కాయిదా ఉగ్రవాద శిక్షణ విషయం వెలుగు చూసింది. బిల్హా కోసం  పోలీసులు గాలిస్తున్నారు. పట్టుబడిన షా ముదిసర్, షోయబ్‌ల నుంచి సెల్‌ఫోన్లు, పాస్‌పోర్టు, ఏటీఎం, జిహాద్ సాహిత్యం, మిలిటెంట్ శిక్షణ కార్యక్రమానికి చెం దిన పత్రాలు, రూ.20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై దేశద్రోహం, పేలుళ్లకు కుట్ర తదితర కేసులను నమోదు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top