కేసీఆర్కు అగ్రికల్చర్ లీడర్షిప్ పురస్కారం
► 2017కు ఎంపిక చేసిన భారత ఆహార, వ్యవసాయ మండలి
► వ్యవసాయదారుల జీవితాల్లో మార్పునకు కృషి చేస్తున్నందుకే...
► సెప్టెంబర్ 5న ఢిల్లీలో పురస్కార ప్రదానం
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక అగ్రికల్చర్ లీడర్షిప్–2017 పురస్కారానికి పాలసీ లీడర్షిప్ విభాగం కింద ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఎంపికయ్యారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో విశేష కృషి చేస్తున్న వారికి 2008 నుంచి భారత ఆహార, వ్యవసాయ మండలి (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్) ఈ పురస్కా రాలను అందజేస్తోంది. లక్షలాది మంది వ్యవసా యదారుల జీవితాల్లో మార్పు కోసం కృషి చేస్తు న్నందుకుగాను ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈ ఏడాది పురస్కారాన్ని ప్రకటించింది. ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ ఆధ్వర్యంలోని కమిటీ కేసీఆర్ను ఈ పురస్కారానికి సిఫారసు చేసింది. సెప్టెంబర్ 5న ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్లో పురస్కార ప్రదానం జరగనుంది.
కేసీఆర్ కృషికి గుర్తింపు: గవర్నర్
ప్రతిష్టాత్మక అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డు–2017కు ఎంపికైన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అభినందనలు తెలిపారు. నీటిపారుదల పథకాల నిర్మాణం ద్వారా వ్యవసాయరంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపికయ్యారని కొనియాడారు.
రైతుల తరఫున అభినందనలు..
ఈ అవార్డుకు ఎంపిౖకైనందుకు సీఎం కేసీఆర్కు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అభినందనలు తెలిపారు. ఒక రైతుగా వ్యవసాయ రంగం సమస్యలపట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం తెలంగాణ రైతుల అదృష్టమని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రెండో రోజే రూ. 17 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర బడ్జెట్లో సగం వ్యవసాయ, అనుబంధ రంగాలకే కేటాయించారని, వ్యవసాయానికి వచ్చే ఏడాది నుంచి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడుతున్నామన్నారు. దేశంలోనే మొదటిసారిగా రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ. 4 వేల చొప్పున ఇవ్వనున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనేనన్నారు. రైతులందరి తరఫున ముఖ్యమంత్రికి హృదయ పూర్వక అభినందనలు తెలుపుతున్నామని పోచారం తెలిపారు.