ఏజెన్సీ@ టూరిజం సర్క్యూట్

ఏజెన్సీ@ టూరిజం సర్క్యూట్ - Sakshi


- గట్టమ్మ నుంచి మల్లూరు వరకు విస్తరణ

- ప్రతిపాదనలు పంపిన పర్యాటక శాఖ

ములుగు:
ములుగు ఏజెన్సీ ఇక టూరిజం సర్క్యూట్‌గా ఏర్పాటు కానుంది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్వదేశ్ దర్శన్ పథకంలో భాగంగా గోదావరి పరివాహక ప్రాంతంలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు పర్యాటకశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఓ నివేదిక రూపొందించారు. వచ్చే నెల మొదటి వారంలో హైదరాబాద్‌లో జరిగే టూరిజం అభివృద్ధి సమావేశంలో జిల్లా అధికారుల నివేదికపై చర్చలు జరిగే అవకాశం ఉంది. నివేదికకు గ్రీన్‌సిగ్నల్ లభిస్తే గట్టమ్మ - మంగపేట, మల్లూరు హేమాచల క్షేత్రం టూరిజం సర్క్యూట్‌గా రూపుదిద్దుకోనుంది.

 

ఇది సర్క్యూట్

ప్రస్తుతం గట్టమ్మ ఆలయం సమీపంలో హరిత హోటల్‌తో పాటు కాటేజీలు, మల్లూరు క్షేత్రం సమీపంలో 8 కాటేజీలు , హరిత హోటల్ నిర్మించనున్నట్లు ఇదివరకే ఆ శాఖ  మంత్రి అజ్మీర చందూలాల్ వెల్లడించారు. వెంకటాపురం మండలం పాలంపేట రామప్ప, గోవిందరావుపేట మండలంలోని లక్నవరం, తాడ్వాయి మండలంలోని మేడారంలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తారుు. ఏటూరునాగారం మండలం కంతనపల్లి, దేవాదుల, జంపన్నవాగు పరిసర ప్రాంతాలైనఊరట్టం, రెడ్డిగూడెం, తాడ్వాయి, ముల్లకట్ట, రామన్నగూడెం ప్రాంతాలను కలుపుతూ నూతనంగా టూరిజం పరంగా అభివృద్ధి చేయాలని శాఖ ప్రతిపాదించింది.

 

పాపికొండలు తరహ బోటింగ్..

పాపికొండలు తరహలో గోదావరి పరివాహక ప్రాంతాల్లోని కంతనపల్లి సమీపంలో సుమారు 25 కిలోమీర్ల మేర బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేసేందుకు నిర్ణరుుంచారు. ఇందుకోసం అధికారులు గోదావరిలో పరిశీలించారు. గోదావరి నది ఒడ్డు ప్రాంతాల్లో ఏర్పాటు చేసే టూరిజం ప్రాంతాలను కలుపుకుంటూ ఆదిలాబాద్ నుంచి వరంగల్ వరకు ప్రత్యేక ప్యాకేజీతో బస్సులు నడిపించి పర్యాటకును ఆకట్టుకునే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. పుష్కరాల సందర్భంగా ఏటూరునాగారం, మంగపేట గోదావరి ప్రాంతాలు, కంతనపల్లి, ముల్లకట్ట, మల్లూరు లాంటి ప్రాంతాలు భక్తులను ఆకర్షించిన కారణంగా ఏకో టూరిజం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు శాఖ అధికారి ఒకరు తెలిపారు.

 

ముల్లకట్ట మరింత అందంగా

ఏటూరునాగారం మండలం ముల్లకట్ట గ్రామం నుంచి ఖమ్మం జిల్లా పూసురులను కలుపుతూ వారధిగా నిర్మించిన ముల్లుకట్ట బిడ్జి ఇప్పటికే పలువురిని ఆకట్టుకుంది. బ్రిడ్జి ప్రాంతంలో హరిత హోటల్ ఇతర అభివృద్ధి పనులు చేపడితే అటు ఖమ్మం జిల్లాతో పాటు ఇటు మన జిల్లా పర్యాటకులను ఆకర్షించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

 

ప్రతిపాదనలు పంపించాం

గట్టమ్మ నుంచి రామప్ప, లక్నవరం, మేడారం, కంతనపల్లి, దేవాదుల, మల్లూరు, గోదావరి పరీవాహక ప్రాంతాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్‌గా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేసి అందించాం. సహకరించాలని కలెక్టర్‌ను కోరాం. వచ్చే నెలలో జరిగే శాఖ సమావేశంలో నివేదికపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ఆమోదం అందితే పనులు ప్రారంభిస్తాం. గోదావరి పుష్కరాలకు వచ్చిన వారు, మేడారం వచ్చిన భక్తులు ఈ ప్రాంతాలకు తిరగివచ్చేలా చూడాలని భావిస్తున్నాం.

- ఎం. శివాజీ, జిల్లా టూరిజం అధికారి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top